ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు.
2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చించి తీర్మానాలు చేయనున్నారు.హైకమైండ్ ఆదేశాలతో పీసీసీ నేతలు 2 రోజుల పాటు చింతన్ శిబిర్ ఏర్పాటు చేశారు. కీసరలోని బాలవికాసలో నవ సంకల్ప్ చింతన్ శిబిర్ జరగనుంది. ఇందుకోసం పీసీసీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ ఆమోదించిన 6 తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఆరు కమిటీలలో ఒక్కో కమిటీలో 30 నుంచి 40 మంది నేతలున్నారు. ఆర్గనైజేషన్ కమిటీకి పొన్నాల లక్ష్మయ్య, యూత్ కమిటీకి దామోదర రాజనర్సింహ, ఎకానమీ కమిటీకి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొలిటికల్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సోషల్ జస్టిస్ కు వీహెచ్ లు కన్వీనర్లుగా ఉన్నారు.
మొదటి రోజు సమావేశాల్లో 6 కమిటీలు సమావేశమై..వారికిచ్చిన అంశాలపై రిపోర్ట్ ప్రిపేర్ చేయనున్నారు. రెండో రోజు 6 కమిటీల కన్వీనర్లు మొదటి రోజు తయారు చేసిన రిపోర్ట్ ను భట్టి నేతృత్వంలోని చింతన్ శిబిర్ నిర్వహణ కమిటీకి అందజేయనున్నారు. చివరగా చింతన్ శిబిర్ తీర్మానాలను ఆమోదించి ఏఐసీసీకి పంపనున్నారు. మొత్తం దాదాపు 150 మందికి మాత్రమే పీసీసీ ఆహ్వానం పంపింది. పార్టీ అధిష్టానం తరపున ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నారు.
