Site icon NTV Telugu

Collector Advaith Kumar : మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ.. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న గిరిజన సంఘాలు.!

Advaith

Advaith

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం బదిలీ చేయడంతో మానుకోట (మహబూబాబాద్) జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా కలెక్టర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గిరిజన ప్రజా సంఘాలు, ఈ బదిలీ వార్త తెలియగానే రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చి, ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

గత రెండు సంవత్సరాలుగా కలెక్టర్‌గా పనిచేసిన అద్వైత్ కుమార్, జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని గిరిజన నాయకులు ఆరోపించారు. ఒక గిరిజన జిల్లాగా ఉన్న మహబూబాబాద్‌ను ఆయన తన నిర్ణయాలతో పదేళ్ల పాటు వెనక్కి నెట్టేశారని వారు విమర్శించారు. రైతుల భూ సమస్యలు, పట్టాదారు పాసుపుస్తకాల జాప్యం వంటి కీలక అంశాలను ఆయన గాలికి వదిలేశారని మండిపడ్డారు.

India Qualification Scenario: భారత్‌ సెమీస్‌కు చేరే నాలుగు అవకాశాలు ఇవే.. డెడ్ ఈజీ సినారియో మాత్రం ఒకటే!

జిల్లా కలెక్టర్‌కు వచ్చే ప్రత్యేక నిధులను (Special Funds) పేద వర్గాల ప్రజల సంక్షేమం కోసం లేదా అభివృద్ధి పనుల కోసం వినియోగించలేదని బాధితులు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన నిధులను తిరిగి ప్రభుత్వానికి పంపించేశారని, ఇది జిల్లా ప్రజలకు చేసిన ద్రోహమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా , వైద్య రంగాల్లో నెలకొన్న కనీస సమస్యలను కూడా ఆయన పరిష్కరించలేకపోయారని ధ్వజమెత్తారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఇచ్చిన ఆదేశాలను కూడా కలెక్టర్ లెక్కచేయలేదని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గిరిజన సంఘాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజన జిల్లా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా సమస్యలను అర్థం చేసుకునే కొత్త కలెక్టర్ రావాలని వారు కోరుకుంటున్నారు.

Aaya Sher: తొమ్మిది దేశాల్లో ‘ఆయా షేర్’ హవా

Exit mobile version