CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి

  • మహిళా శక్తి వారోత్సవాల ముగింపు సభలో సీఎం కీలక వ్యాఖ్యలు
  • మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ
  • ఉచిత బస్సు పథకంపై విమర్శలకు సీఎం కౌంటర్
  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న రేవంత్
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : ఆడబిడ్డలను లక్ష్మీదేవిగా కొలిచే సంస్కృతి మనదని, భూమిని భూమాతగా, దేశాన్ని భారతమాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావించి గౌరవించుకునే గొప్ప సాంప్రదాయం మనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘మహిళా శక్తి వారోత్సవాల’ ముగింపు సభలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి వీరనారీమణులు తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటారని గుర్తుచేశారు. దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించి, వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత జవహర్‌లాల్ నెహ్రూదేనని, కాంగ్రెస్ పార్టీయే మహిళలకు రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రులుగా అవకాశాలు కల్పించిందని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 2013లోనే సోనియా గాంధీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని, రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మహిళలు ప్రధాన పాత్ర పోషించబోతున్నారని తెలిపారు. ఇదే సమయంలో విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. గత ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఒక్క మహిళకు కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏనాడూ తమ పార్టీ అధ్యక్షుడిగా మహిళను నియమించలేదని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలను కూడా ఎగ్గొట్టిందని, కానీ తమ ప్రజా ప్రభుత్వం రాగానే ఆ బకాయిలను మంజూరు చేసిందని సీఎం తెలిపారు. తాము ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కొందరు కడుపు నిండా విషం నింపుకుని, కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ రద్దు చేయాలని రోడ్డెక్కారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తున్నామని, దీనివల్ల వేలాది మంది ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారని చెప్పారు. వాతావరణ శాఖ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంటుందని హెచ్చరించినప్పటికీ, తాము మహిళా సంఘాల కోసం 553 సరికొత్త బస్సులను ప్రారంభించగానే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాడంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

×
×
Ad

మహిళలను కేవలం చిన్న చిన్న పనులకే పరిమితం చేయకుండా.. అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలతో పోటీ పడేలా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టుపనిని కూడా వారికే ఇచ్చామన్నారు. కార్పొరేట్ ఆఫీసులకు దీటుగా ‘ఇందిరా మహిళా शक्ति భవనాలను’ నిర్మిస్తున్నామని, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీలో 106 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించేలా గ్లోబల్ మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతిలోనే ఉందని విశ్వసిస్తూ, రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చడమే తమ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. “ఈ వేదికగా నా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పూర్తి బాధ్యత నాది” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మహిళా సంఘాలకు వెయ్యి కాదు.. ఏకంగా 3 వేల బస్సులు కొనిచ్చి వారిని యజమానులను చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 2034 వరకు ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఇలాగే విజయవంతంగా నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ.. రైతులు ఒకే రకమైన పంటలపై ఆధారపడకుండా, మార్కెట్ డిమాండ్‌ను బట్టి అన్ని రకాల పంటలు వేసేలా మహిళా సంఘాలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.