CM Revanth Reddy : సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్‌ను కూడా తీసుకురండి

  • అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ను తీసుకురావాలని సీఎం సవాల్
  • రూ.8.11 లక్షల కోట్ల అప్పులపై చర్చకు సిద్ధమన్న రేవంత్
  • రైతులు, ఉద్యోగాలు, మహిళా సంక్షేమంపై ప్రభుత్వ ప్రగతి వివరణ
  • ప్రజా పాలన వర్సెస్ కుటుంబ పాలనపై సీఎం ఘాటు వ్యాఖ్యలు
Revanth Kcr

Revanth Kcr

వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన “ప్రజా పాలన ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఓరుగల్లు పోరాట స్ఫూర్తిని కొనియాడుతూనే, గత బీఆర్ఎస్ పాలనపై, కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్‌లో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నామని, అభివృద్ధి , అప్పులపై చర్చకు రావాలని కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు.

వరంగల్ చైతన్యానికి ప్రతీక.. గోతి తీసి పాతిపెట్టిన చరిత్ర

ప్రజా సమస్యలపై నిలదీసే నైజం, పోరాడే శక్తి ఓరుగల్లు గడ్డకు సొంతమని, జయశంకర్, దాశరథి వంటి మహనీయులు నడయాడిన ఈ ప్రాంతం ఎల్లప్పుడూ అణచివేతకు వ్యతిరేకంగా చైతన్యాన్ని ప్రదర్శించిందని సీఎం తెలిపారు. తమను తాము దేవుళ్లుగా భావించి ప్రజలపై ఆధిపత్యం చలాయించాలని చూసిన వారిని, ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడి అధికారమే శాశ్వతమని అనుకున్న వారిని ఇక్కడి ప్రజలు ఓడించి గోతి తీసి పాతిపెట్టారని పేర్కొన్నారు. పాలకుర్తిలో మాజీ మంత్రిని ఓడించి తమ అభ్యర్థి యశస్విని బద్దలు కొట్టిన ఘనత ఈ ప్రాంతానిదేనని ప్రశంసించారు.

అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం.. రూ.8.11 లక్షల కోట్ల అప్పుల భారం

రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను వివరిస్తూ, గత ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చిందని, వీటికి మిత్తి (వడ్డీ) కిందనే ప్రతి ఏటా రూ.75 వేల కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. సెప్టెంబర్ నెలలో తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, ఆ సమావేశాలకు “బావా బామ్మర్దులు” (కేటీఆర్, హరీష్ రావు) చర్చకు రావాలని… కేసీఆర్ ను తీసుకురావాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రైతాంగ సంక్షేమం , మహిళా సాధికారత

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ, “కాళేశ్వరం కూలేశ్వరం అయినా” ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ప్రాజెక్టులను నింపి రైతులు అత్యధికంగా వరిధాన్యం పండించేలా చేశామని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశామని, సన్న ధాన్యానికి బోనస్ అందించామని తెలిపారు. రైతుల కోసం రూ.90 వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంతో పాటు రైతు భరోసా, రుణమాఫీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, తమ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలను (సీతక్క, కొండా సురేఖ) మంత్రులను చేశామని, ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలను గౌరవించుకుంటున్నామని చెప్పారు.

నిరుద్యోగులకు పిలుపు.. ఆస్తి , కుటుంబ వివాదాలపై వ్యాఖ్యలు

నిరుద్యోగులను రెచ్చగొట్టే రాజకీయనాయకుల మాయమాటలను నమ్మవద్దని సీఎం కోరారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసిందని, పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌తో పాటు వయోపరిమితిని సడలించామని తెలిపారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామని, నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత సోదరినే ఇంటి నుంచి గెంటేసిన చరిత్ర వారిదని, తండ్రి ద్రుతరాష్ట్రుడిలా మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో రక్తం ఇచ్చిన కార్యకర్తల రక్తాన్ని విక్రయించుకున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజా పాలన వర్సెస్ కుటుంబ పాలన

తమ పాలనకు, గత పాలకుల కుటుంబ స్వార్థానికి ఉన్న వ్యత్యాసాన్ని సీఎం వివరించారు. కేసీఆర్ హయాంలో పదవులన్నీ తన కొడుకు, అల్లుడు, బిడ్డ, చుట్టాలకే దక్కాయని.. కానీ ప్రజా ప్రభుత్వంలో సామాన్య కార్యకర్తలకు, ఉద్యమకారులకు అవకాశాలు లభించాయని చెప్పారు. కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కావ్య, యశస్విని, వేం నరేందర్ రెడ్డి, కోదండరాం, మహేష్ గౌడ్ వంటి వారికి పదవులు ఇవ్వడం ప్రజా ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా తమను ఏమీ చేయలేరని, 2029లోనూ రెట్టింపు మెజారిటీతో మళ్లీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.