CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..

  • మున్సిపల్ శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
  • భూసేకరణ పూర్తయ్యాకే టెండర్లకు గ్రీన్ సిగ్నల్
  • జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ ప్రాజెక్టులకు వేగం
  • మన్మోహన్ సింగ్ విగ్రహం, కొత్త భవనాలపై సూచనలు
Cm Revanth

Cm Revanth

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్ డి) బోధి పెవిలియన్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మూడు కమిషనరేట్‌ల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి. సృజన, ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అభివృద్ధి పనులకైనా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా టెండర్లు పిలవవద్దని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గాను ఇప్పటికే ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అలాగే జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో ప్రాజెక్టుల అనుమతులు వేగంగా లభించేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

మాజీ ప్రధాని విగ్రహం, నిర్మాణ నమూనాల పరిశీలన

సైబరాబాద్‌ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం , దానికి సంబంధించిన జంక్షన్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ వెంటనే వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. దీనితో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన భవన నమూనాతో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నమూనాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి, వాటి నిర్మాణం , సౌకర్యాలపై అధికారులకు పలు విలువైన సూచనలు చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.