CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ సమావేశం సుమారు గంటకు పైగా కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ , మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణపై ఈ భేటీలో కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని మావోయిస్టుల అంశం చర్చకు వచ్చింది. మావోయిస్టుల లొంగుబాటు (Surrender) , వారికి పునరావాసం కల్పించే అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న “మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్” గురించి కూడా ఈ భేటీలో ప్రాథమిక చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా నక్సలిజం ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించే ఈ సదస్సులో తెలంగాణ తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ భేటీలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి , ఐజి సుమతి ఈ సమావేశానికి హాజరై, రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రికి వివరించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో తెలంగాణలో మావోయిస్టు ముప్పును పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. భద్రతా పరమైన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో దృష్టి సారించారు.
