రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోరాటం చేస్తున్న కీలక నేతలు సైతం ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవడం రాష్ట్రంలో శాంతి స్థాపనకు కొత్త ఊపిరి పోసింది. ప్లాటూన్-1, TSC, DK SZC, 2nd CRC వంటి ప్రధాన విభాగాలకు చెందిన ఈ మావోయిస్టుల లొంగుబాటు వెనుక పోలీసు ఉన్నతాధికారుల దీర్ఘకాలిక శ్రమ, ప్రభుత్వ పునరావాస విధానాలపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.
Interest Rates Cut: ఆ బ్యాంక్లో లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు..
ఈ భారీ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు మొత్తం 124 అత్యాధునిక తుపాకులను వారు పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక INSAS LMG రైఫిల్తో పాటు, 31 AK-47లు, 21 INSAS రైఫిళ్లు, 20 SLR రైఫిళ్లు, , 18 .303 రైఫిళ్లు ఉన్నాయి. వీటితో పాటు 5,205 తూటాలు, 9mm పిస్టల్స్ , ఇతర పేలుడు పదార్థాలను కూడా వారు సమర్పించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులతో పాటు 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మావోయిస్టుల లొంగుబాటును సాదరంగా ఆహ్వానించారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారందరి ఆర్థిక , ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందని, సొంత గ్రామాల్లో వారు స్థిరపడటానికి ఇళ్ల నిర్మాణంతో పాటు తగిన ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు, ముఖ్యంగా కీలక నేత గణపతి వంటి వారు కూడా బయటకు రావాలని, ఆయన ప్రాణాలకు , ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సీఎం ఒక బహిరంగ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఆయుధాలతో లొంగిపోయే వారికి అత్యుత్తమ పునరావాసం కల్పిస్తామని, ప్రజాస్వామ్య పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించుకుందామని సీఎం స్పష్టం చేశారు.