CM Revanth Reddy: ఉద్యోగుల జీతాలపై రేవంత్ కీలక నిర్ణయం.. ఏజెన్సీలకు వార్నింగ్

  • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెల 1నే జీతాలు
  • డిజిటల్ గవర్నెన్స్‌కు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం
  • జీతాలు ఆలస్యం చేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు
Cm Revanthreddy

Cm Revanthreddy

CM Revanth Reddy: రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ‘డిజిటల్ గవర్నెన్స్’ దిశగా చట్టాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు అందేలా చూడాలని, ఇందుకోసం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సదరు ఉద్యోగుల వివరాలు, వారి జీతాలు, బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు.

ఈ డిజిటల్ గవర్నెన్స్ ప్రక్రియపై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ రాబోయే 100 రోజుల్లోగా నివేదిక సమర్పించి, ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదే సమయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పారు.