CM Revanth Reddy : తెలంగాణ రాజకీయ భవిష్యత్తు , జాతీయ స్థాయి ఎన్నికల విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో, 2029లో దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల విభజన, రాష్ట్రాల వాటాపై ఆయన తన గళాన్ని వినిపించారు.
రాబోయే డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న ఎంపీ స్థానాల నిష్పత్తి ప్రకారమే భవిష్యత్తులోనూ విభజన జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించేలా కాకుండా, ప్రస్తుతం ఉన్న నిష్పత్తిని కాపాడుతూనే నియోజకవర్గాల పెంపు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను తగ్గించే ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే సామాజిక న్యాయం దిశగా ఒక కీలక అడుగు అని, ఇది భవిష్యత్తులో సమగ్ర అభివృద్ధికి పునాది వేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. “ఎవరు సహకరించినా, సహకరించకపోయినా మేము మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం” అని ధీమా వ్యక్తం చేశారు. అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఆమోదం పొందకపోవడంపై స్పందిస్తూ, ఆ ప్రశ్నకు గవర్నర్ దగ్గరే సమాధానం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే, అన్ని కులాలు తనను సొంత మనిషిగా భావిస్తున్నాయని, కేవలం శర్మలు మాత్రమే ఇంకా తనను ఓన్ చేసుకోలేదని చమత్కరించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలపై రేవంత్ రెడ్డి సూటిగా స్పందించారు. “అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబం కలిసి ఉంది.. అధికారం కోల్పోగానే విడిపోయారు” అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. “మన ఇంట్లో ఉన్న ఆడపిల్లను మనం గౌరవంగా చూసుకుంటే, బయట వారు మన గురించి మాట్లాడే అవకాశం ఉండదు. ఇంట్లో సమస్యను వాళ్లే పరిష్కరించుకోలేనప్పుడు బయట వ్యక్తులు ఎందుకు వస్తారు?” అని ప్రశ్నించారు. తనకు వయసు తక్కువైనా, ఈ రాజకీయ పరిణామాలు తనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
