హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం , ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, కేవలం సేవకుడిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఆయన పునరుద్ఘాటించారు. “నేనే రాజు.. నేనే మంత్రి” అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ఆ మాటలకు అసలు అర్థం బాధ్యత స్వీకరించడమేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల గెలుపోటములకు తానే బాధ్యత వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలో, ప్రజలు 90 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చారని, ఇది తన పనితనానికి ప్రజలు ఇచ్చిన గీటురాయి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఈ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రజల తీర్పును అవమానిస్తున్నారని, కానీ పేదలు తనపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి మూలమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
IND vs PAK: పాకిస్థాన్ అంటేనే ఊగిపోతున్న హార్దిక్ పాండ్యా.. గణాంకాలు చూస్తే మతి పోవాల్సిందే!
సామాజిక న్యాయం , దళితుల సాధికారతపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన వారికి భిన్నంగా, నేడు అదే దళితుడిని అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టామని గుర్తు చేశారు. ఒకప్పుడు దళితులు రాష్ట్రాన్ని నడపలేరని హేళన చేసిన వారే, నేడు అదే దళితుడిని ‘అధ్యక్షా’ అని పిలిచి మైక్ అడిగే పరిస్థితిని తాము కల్పించామని, ఇది అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప అవకాశమని కొనియాడారు. ప్రభుత్వంలో ఎస్సీ వర్గాలకు 30 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చామని చెప్పారు. 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను తాము పరిష్కరించడం వల్లే, నేడు బుడిగ జంగాల వంటి వెనుకబడిన వర్గాలకు ఎంబీబీఎస్ సీట్లు అందుతున్నాయని, ఈ మార్పు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు.
రాబోయే 20 ఏళ్లు కూడా తాను పేదల కోసమే పని చేస్తానని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తన సేవలు కొనసాగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిపాలనలో డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులుగా పేదల పిల్లలను చూడాలన్నదే తన కల అని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. గెలిచినప్పుడు విర్రవీగడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం తన నైజం కాదని, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా లేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తనపై బాధ్యత మరింత పెరిగిందని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో పనిచేస్తానని రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ఉద్ఘాటించారు.
CM Revanth Reddy: 20 ఏళ్ల నా రాజకీయ ప్రయాణంలో లంబాడాల పాత్ర అమూల్యం..
