NTV Telugu Site icon

CM KCR: వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. అప్రమత్తంగా వుండాలని ఆదేశాలు

Fxi8q4kacaeerji

Fxi8q4kacaeerji

రాష్ట్రంలో తాజా వాతావరణ పరిస్థితులు, వరదలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. దేవాదుల ప్రాజెక్ట్ ముంపుపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. నియోజకవర్గాలు వదిలి ప్రజాప్రతినిధులు బయటకు రావద్దన్నారు. విద్యుత్ సరఫరా కు అంతరాయం కాకుండా చూడాలని, నెల రోజుల కోసం సరిపడే బొగ్గు ను సిద్దం చేసుకోవాలన్నారు. వరదలు తగ్గగానే విత్తనాలు.. ఎరువులు సిద్దం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు సీఎం కేసీఆర్.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు రిజర్వాయర్లు నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో.,తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ.. వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేసిన సిఎం కెసిఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో వానలు వరదల పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా ఇటు గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది హెచ్చరికలుదాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో నదిమీది ఎస్సారెస్పీ వంటి పలు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో అవుట్ ఫ్లోల గురించి ఆరాతీస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు సిఎం కెసిఆర్ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

మహారాష్ట్ర ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టవలసిన చర్యలకు ఫోన్లో అదేశాలిస్తున్నారు సీఎం కేసిఆర్. వరదల వల్ల రవాణా విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలను సిఎం ఆరా తీస్తున్నారు.గోదావరి నది మీది కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నా ఇంకా వరద పెరుగుతున్నదని అధికారులు సిఎం కు వివరించారు. ఈమేరకు ముంపు కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించారు. అక్కడే వుండి రక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్న స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఫోన్లో సిఎం తగు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ మరియు ఇతర వరదముంపుకు గురౌతున్న పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను సిఎం ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సిఎం ఆదేశించారు. ఎక్కడకూడా ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సిఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లకు సిఎం ఆదేశాలిచ్చారు.

భద్రాచలం లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడే వుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్తితిని చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో సిఎం కెసిఆర్ సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సిఎం ఆదేశించారు.

విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాలద్వారా విద్యుత్తును పునురుద్దరిస్తున్నట్టు సిఎండీ రఘురామారెడ్డి సిఎం కు వివరించారు. ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను పట్టి అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలని సిఎం అన్నారు. దేవాదుల ప్రాజెక్టుల పనులు పురోగతి లో ఉన్న నేపథ్యంలో వరదనీరు చేరుకోవడం తో తక్షణ చర్యలు చేపట్టి వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ మురళీధర్ రావుకు సిఎం కెసిఆర్ ఆదేశించారు.

సమీక్షా సమావేశం నుంచే వరద ముంపు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఫోన్లో అడిగి తెలుసుకుని ఆదేశాలు జారీచేశారు. ఎట్టిపరిస్థితుల్లో పరిస్థితులు చక్కబడేవరకు వారి వారి నియోజకవర్గాలు జిల్లాలు విడిచి వెల్లరాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను ఎమ్మెల్యేలను సిఎం కెసిఆర్ ఆదేశించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యం లో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు విద్యాశాఖ అధికారులను ఉత్తర్వులు జారీ చేయాలని సమీక్ష సమావేశం నించే సీఎం కేసిఆర్ ఆదేశించారు.సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి అధికారులు, సీఎంఓ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఈఎన్ సి మురళీధర్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, జిహెచ్ ఎంసి, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Chandra Babu: కొండల్ని అక్రమంగా తవ్వేస్తున్న వారందరినీ బోనెక్కిస్తాం