తెలంగాణలో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దీనిలో భాగంగా.. సర్వే కంపెనీలతో చర్చలు కూడా జరిపారు సీఎస్ సోమేష్కుమార్.. ఇవాళ సీఎం కేసీఆర్ వారితో సమావేశమయ్యారు. డిజిటల్ సర్వేపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. సర్వేలో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలనుంచి ఎంపిక చేయాలని సిఎం సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్.. డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు, ప్రగతి భవన్ లో బుధవారం సిఎం కెసిఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణకోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చినం. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. .
తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని, వ్యాపారం కోణం లోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్.. పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. తద్వారా పూర్తిస్థాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సిఎం సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదన్నారు. తెలంగాణ ను సాధించుకుని అన్ని రంగాలను తీర్చి దిద్దుకుంటున్నాం.. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి నీరు అందిస్తున్నాం.. తెలంగాణ ఇవాళ పంజాబ్ ను మించి ధాన్యాన్ని పండించే పరిస్థితికి చేరుకుందని.. ఈ నేపథ్యంలో భూములకు ధరలు కూడా పెరుగుతున్నవి. ప్రజల భూములకు రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మధ్య దళారీలు లేకుండా సామాన్య రైతును పీడించే వ్యవస్థలను తొలగించి పూర్తి పారదర్శకంగా వుండే విధంగా ధరణి పోర్టల్ ను ప్రభుత్వం రూపొందించిందన్నారు8. గ్రామాల్లో తగాదాలు లేని విధంగా ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ వ్యవహారాలు చక్కబడిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు కేసీఆర్.
డిజిటల్ సర్వే నిర్వహించే విధి విధానాల గురించి సిఎం కెసిఆర్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. వారి కార్యాచరణ గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల భూముల్లో ఇంచు కూడా తేడా రాకుండా కొలతలు వచ్చే విధంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సర్వే చేపట్టాలని వారికి సూచించారు. తేడాలు రాకుండా సర్వే చేయాల్సిన బాధ్యత సర్వే ఏజెన్సీలదేనని, ఏమాత్రం అలసత్వం వహించి నిర్లక్యం చేసి తప్పులకు తావిచ్చినా, చట్ట పరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదని సర్వే ఏజెన్సీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. గ్రామాల్లో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంబిస్తున్న టీపన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ ప్రజలతో గ్రామ సభలను నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సర్వే కార్యక్రమాలను చేపట్టాలని సిఎం సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం ఏజెన్సీలకు అందిస్తుందని, సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు అందుబాటులో వుంటూ సర్వే ఏజెన్సీలకు సహకరిస్తారని సిఎం చెప్పారు.