భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమం 10వరోజుకు చేరింది. 10వ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వైభవంగా నిర్వహించడం అంత సులువేమీ కాదని.. కానీ అసాధ్యాన్ని నరేంద్ర చౌదరి సుసాధ్యం చేశారని కిషన్రెడ్డి కొనియాడారు.
అంతేకాకుండా దేవుడి మీద భారం వేసి.. భక్తి టీవీ సిబ్బందిని ఏకం చేసి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది తమ బీజేపీ ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని.. ఇదే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలను జరుపుకుంటున్నామని తెలిపారు. కరోనా కారణంగా ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కిషన్రెడ్డి సూచించారు. తాము కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తున్నామని.. ఇంకా ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోలేదో వారు ఇప్పటికైనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అనంతరం ఆయన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి దీపార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.