Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను అణచివేస్తాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తే తమ ప్రజా ప్రభుత్వం ఊరుకోదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సింగరేణి కార్మికులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ దొంగ నాటకాలు

రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి ‘దొంగా దొంగా’ అన్నట్లుగా దొంగ నాటకాలు ఆడుతున్నాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. “10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడీ చేసి, ఇప్పుడు కేటీఆర్ ఒక లేఖ, కిషన్ రెడ్డి ఒక లేఖ రాసుకుంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉంటే తమకు నచ్చిన వారే పోటీ చేసేలా వ్యవస్థను మార్చుకుంది అనడానికి మీనాక్షి నటరాజ్ వ్యవహారమే సాక్ష్యం. ఎలాంటి కేసు లేకపోయినా ఆమెను తిరస్కరించారు. ప్రజాస్వామ్యవాదులకు ఇదొక పెద్ద హెచ్చరిక” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారాయని, వాటి వల్ల ప్రస్తుతం నెలకు రూ. 7 వేల కోట్లు అప్పులు కట్టాల్సి వస్తోందని గుర్తుచేశారు.

×
×
Ad

అబద్ధాల రావుగా మారిన హరీష్ రావు

బీఆర్‌ఎస్ నేత హరీష్ రావుపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “హరీష్ రావు గతంలో మంత్రిగా పనిచేసిన హోదాను మరిచిపోయి రోజుకో అబద్ధం చెబుతూ ‘అబద్ధాల రావు’గా మిగిలిపోయారు. బ్యాంకింగ్ రంగం దగ్గర రాష్ట్రాన్నే కుదవబెట్టిన ఘనత మీది కాదా? ప్రజలు ఒకటి రెండు రోజులు నమ్ముతారు కానీ, ప్రతిసారీ మీ అబద్ధాలను నమ్మరు. దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ మీ అనునాయులకు కోల్ బ్లాక్‌లు దక్కేలా చూస్తున్నారు” అని విమర్శించారు. హరీష్ రావు, కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో సింగరేణి సౌధాన్ని కూల్చాలని, ఈ సంస్థను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

కిషన్ రెడ్డి వల్ల సింగరేణికి రూ. 6,000 కోట్ల నష్టం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం దుయ్యబట్టారు. తాడిచెర్ల బ్లాక్ సింగరేణికి రాకుండా కేంద్రం దగ్గరే పెట్టుకున్నది నిజం కాదా అని నిలదీశారు. కిషన్ రెడ్డి బొగ్గు గనుల మంత్రిగా ఉండి సాధించింది ఏంటని ప్రశ్నించారు. “చాలా తెలివిగా, దుర్మార్గంగా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు బ్లాకులు అప్పగించి, సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసింది కిషన్ రెడ్డే. తాడిచెర్ల, సత్తుపల్లి బ్లాక్-3ల ద్వారా సింగరేణి సంస్థకు రూ. 6,000 కోట్ల భారీ నష్టం తెచ్చారు” అని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను ప్రజా ప్రభుత్వం అణచివేస్తుందని హెచ్చరించారు.

కార్మికుల గుండె చప్పుడు విన్నాం.. సింగరేణి మనది

తన పాదయాత్రలో అనేకమంది కార్మిక సోదరులను కలిసి వారి గుండె చప్పుడు విన్నానని భట్టి విక్రమార్క గుర్తుచేసుకున్నారు. సింగరేణిని పెత్తందారులు, దోపిడీదారుల కబంధ హస్తాల్లో పడకుండా కాపాడుకుంటామన్నారు. ఈ రోజు 335 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, త్వరలోనే మరికొందరికి కారుణ్య నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది కార్మికుల హక్కని స్పష్టం చేశారు. అలాగే, 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5,000 బోనస్ ఇచ్చిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానిదేనని చాటిచెప్పారు. సింగరేణి అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డు అని, దాని రోజువారీ కార్యక్రమాల్లో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని తెలిపారు. కార్మికుల రక్తపు చెమట చుక్కలతో వెలుగుందుతున్న సింగరేణిని కాపాడుకోవడానికి కార్మికులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.