NTV Telugu Site icon

Rapolu Anand Bhaskar Resigns: బీజేపీకి రాపోలు రాజీనామా.. నడ్డాకు లేఖ..

Rapolu Anand Bhaskar

Rapolu Anand Bhaskar

బీజేపీకి గుడ్‌బై చెప్పి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్.. అందులో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.. ఈ మేరకు బీజేపీ జీతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు.. స్వర్గీయులు అరుణ్‌జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్‌ 4న మీ పార్టీలో చేరా. ఇంతకాలం పార్టీలో మీలాంటి మహానుభావులతో కలిసి ఉండే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. బీజేపీకి నేను ఈ క్షణం నుంచి దూరమవుతున్నాను.. పార్టీలో చేరే సమయంలో నేను ఒక ప్రకటన చేశాను. వాటిలో కొన్నింటిని కింద పొందుపరుస్తున్నా అంటూ.. “ఆధునిక యాంత్రిక సమాజం కుట్రలు, కుతంత్రాలతో నిండిఉన్నది. ఇలాంటి సమయంలో భారతీయుల్లో దేశభక్తి, జాతీయవాదం అనేది ఎంతో ముఖ్యం. రాష్ట్రాల్లోని స్థానిక ప్రజల గౌరవాన్ని కాపాడితేనే దేశానికి గుర్తింపు. భారతీయ ఆత్మ, జాతీయత భావన అనేవి ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. అప్పుడే దేశ సమగ్రత, ప్రాదేశిక భద్రత పరిపుష్టమౌతుంది” అని తన లేఖలో రాసుకొచ్చారు.

Read Also: Minister Dharmana Prasada Rao: నేను రాజీనామా చేస్తానంటే సీఎం ఆపారు..!

పార్టీ నియమాలను శ్రద్ధగా చదివిన వాడిని… అందులో బీజేపీకి “సానుకూల లౌకికవాదం” ఖశ్చితంగా శిరోధార్యం అని నిర్ధారించారు. అంటే వసుదైవ కుటుంబ భావనకు పార్టీ పెద్దపీట వేస్తుందనుకొన్నా.. ఈ సూత్రానికి ఆ పార్టీ నిజంగా కట్టుబడి ఉన్నదా? అని ప్రశ్నించారు రాపోలు.. గ్రేట్‌ బ్రిటన్‌ జనాభాలో భారత సంతతికి చెందిన వారు 3 శాతమే. అయినప్పటికీ, భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధానిగా నియమితులయ్యారు. మరో అగ్రరాజ్యం అమెరికాకు భారత సంతతికి చెందిన మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఇలా ఉండగా.. మన దేశంలో ఎలాంటి తరహా ఇబ్బందికరమైన విచ్చిన్నకర రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయి? సమగ్ర మానవతావాదం, అంత్యోదయ భావనలను పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ సూచించారు. ఈ విశిష్ట లక్ష్యాలను చేరడానికి పార్టీలో ఏ కొసైనా నిబద్ధత కనిపిస్తున్నదా? అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల ప్రియతమ నాయకుడు స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయీ రాజధర్మాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. సహకార సమాఖ్యవాదంలో ఆయన పిలుపును ఎప్పుడైనా అనుసరించారా? రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సమాజంలో చీలికలు తీసుకురావడమే పార్టీకి నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు.

కరోనా కారణంగా దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అయితే, ఇవేమీ పట్టించుకోని కేంద్రప్రభుత్వం.. ఆక్సిజన్‌ కొరతతో ఎవ్వరూ మరణించలేదని ప్రకటించింది. కరోనా కట్టడిలో విజయం సాధించినట్టు సంబురాలు చేసుకొన్నది. అయితే, ప్రభుత్వ చర్యలను చూసి పెద్దయెత్తున ప్రజలు నవ్వుకుంటున్నారు. పార్టీని వీడే సమయంలో ఇలా తప్పులు ఎత్తిచూపడం నా లక్షణం కాదు. హుందాతనం అనిపించుకోదని తెలుసు. అయితే, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొంటారనే ఇదంతా చెబుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు రాపోలు ఆనంద్‌ భాస్కర్.. సామాజిక భద్రత, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత అనే వాటిని పార్టీ పట్టించుకోవట్లేదు. జనాభాలో కులగణనకు పార్టీ, కేంద్రప్రభుత్వం పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. అప్పటి నుంచి నాలో భయం మొదలైంది. ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారింది. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం ఎక్కువైంది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన అవకాశాలను అందకుండా చేస్తున్నది. మిషన్‌ భగీరథ అనేది పారే నదీజలం తాగునీరుగా అందించే ప్రపంచస్థాయి మిషన్‌. తెలంగాణలో దీన్ని అమలు చేశారని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పైకి ఉబికి వచ్చాయి. నదీజలాల నిండు గర్భంగా తెలంగాణ మారింది. దీంతో వాతావరణ పరిరక్షణే కాకుండా నీటి పారుదల వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారింది. ఇన్ని జరుగుతున్న తెలంగాణను పొగడాలని నేను అడగట్లేదు. అయితే, బీజేపి తెలంగాణ శాఖ అధికారానికి రావాలనే ఆసక్తితో ఉన్న వారిలా బాధ్యతతో వ్యవహరించడం లేదన్నది మీ నాయకత్వం గమనిండం లేదా? అని లేఖలో ప్రశ్నించారు రాపోలు.. తెలంగాణ ప్రజలు అత్యంత తెలివైనవారు. వారికేమీ గుర్తుండవని అనుకొంటున్నారు. అది మాత్రం నిజంకాదన్నారు.. గడిచిన నాలుగేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో నన్ను విస్మరించారు. ఎన్నోసార్లు అవమానించారు. తక్కువ చేసి చూశారు. జాతీయస్థాయిలో ప్రాధాన్యం లేకుండా చేశారు. అయినప్పటికీ, ఆ ఆవేదనను దిగమింగుతూనే వచ్చా. ఇదే నా తలరాతగా భావించా. ఇప్పుడు, బీజేపీ ప్రాథమిక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో రాసుకొచ్చారు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌.