సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే సంస్థ ఉనికికే తీవ్ర ప్రమాదమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భద్రాద్రి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ, గతంలో వేలంలో పాల్గొనకపోవడం వల్లే రెండు బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం అయ్యాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఈ పరిస్థితిని మార్చి సింగరేణిని వేలం పాటల్లో పాల్గొనేలా అనుమతులు ఇచ్చామని తెలిపారు. గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలను తాము అధికారంలోకి వచ్చాక సమన్వయంతో సరిచేస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం బిఆర్ఎస్, బిజెపిలు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపకుండా, తాటిచెర్ల బ్లాక్ను అడ్డుపెట్టుకుని ఇప్పుడు సింగరేణిపై నకిలీ ప్రేమ ఒలకబోస్తున్నారని, ఈ విషయాన్ని కార్మికులు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు.. పునరావృతం కానివ్వం
గత ప్రభుత్వ హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల డిమాండ్కు తగ్గట్టుగా సరైన ప్రణాళికలు రూపొందించకపోవడం వల్లే నేడు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని స్పష్టం చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా రాబోయే 20 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

