Bhatti Vikramarka : కేటీఆర్‌కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు

  • ఎల్ నినోపై కేటీఆర్‌కు అవగాహన లేదన్న భట్టి
  • విషప్రచారం చేయొద్దని బీఆర్ఎస్‌కు హితవు
  • మేడిగడ్డ కుంగడంపై హరీశ్ రావుకు ప్రశ్నలు
  • కాంగ్రెస్ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ భద్రమన్న డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : “కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసి, అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచ వాతావరణ మార్పులు, ‘ఎల్ నినో’ ప్రభావంపై కనీస అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ (NPDCL) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజులతో కలిసి ఆయన మాట్లాడారు.

వాతావరణ మార్పులపై అవగాహన లేని వ్యాఖ్యలు

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, నిపుణులు వివరిస్తున్నారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తెలంగాణకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రానికి ముఖ్యమంత్రి వెళ్లి ఏమైనా విపత్తులు సృష్టిస్తే ఇక్కడ కరువు వచ్చిందా అని ప్రశ్నించిన ఆయన, అంతటి జ్ఞానం లేకుండా కేటీఆర్ మాట్లాడటం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం కానీ, దుర్మార్గమైన ఆలోచనలతో విషప్రచారం చేయవద్దని హితవు పలికారు. పదేళ్ల అధికార దుర్వినియోగంతో దోపిడీ చేసిన సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న పత్రికలు, ఛానళ్ల ద్వారా ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు బురదజల్లుతున్నారని, ఈ అబద్ధపు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రాజెక్టులు భద్రం.. మేడిగడ్డ ఎందుకు కుంగింది?

ఈ సందర్భంగా మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావును సూటిగా ప్రశ్నిస్తూ, లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. కేవలం 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మూడేళ్లకే ఎందుకు కుంగిపోయాయని నిలదీశారు. కాళేశ్వరం కంటే ఎగువన గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యంతో నేటికీ సురక్షితంగా ఉండి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని తెలిపారు. అలాగే ఆరు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాంసాగర్ (SRSP) ప్రాజెక్టు కూడా గోదావరి ఉధృతికి చెక్కుచెదరకుండా నిలబడిందని గుర్తుచేశారు. అదే గోదావరి నది, అదే ఇసుక పునాదిపై కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా సురక్షితంగా ఉంటే, బీఆర్ఎస్ కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కేవలం మూడేళ్లలోనే ఎందుకు కుంగిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.