Bandi Bhagirath : సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు తమ వేటను మరింత ముమ్మరం చేశారు. హైకోర్టులో భగీరథ్ కు మధ్యంతర బెయిల్ లభించకపోవడంతో, పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న భగీరథ్ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
భగీరథ్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా నాలుగు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడు దేశ రాజధాని ఢిల్లీతో పాటు కరీంనగర్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో దాక్కుని ఉండవచ్చనే అనుమానంతో ఈ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. భగీరథ్ మొబైల్ సిగ్నల్ను ట్రాక్ చేసిన సాంకేతిక బృందం.. చివరగా అతని లొకేషన్ కరీంనగర్లోని తన మేనమామ ఇంట్లో చూపించినట్లు గుర్తించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఒక పోలీసు బృందం కరీంనగర్ చేరుకుని అక్కడ ముమ్మరంగా విచారణ జరిపింది.
ఈ కేసులో బాధితురాలు రెండోసారి ఇచ్చిన అదనపు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం.. మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్తో పాటు, నానక్రామ్గూడలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్కు పోలీసులు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించారు. అక్కడ అసలు ఏం జరిగింది అనే కోణంలో సుదీర్ఘంగా విచారణ సాగించారు. కేసును మరింత పటిష్టం చేసే దిశగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
