Akbaruddin vs Sridhar Babu : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎంఐఎం స్టార్ క్యాంపెయినర్ అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ వేదికగా తనదైన శైలిలో విమర్శల గళం విప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మేము ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. పనులు కావాలన్నా, అధికారం కావాలన్నా ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాల్సి ఉంటుంది. అది రెడ్డి అయినా, రావు అయినా ఎవరైనా సరే.. మా మద్దతు లేకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం మద్దతు అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుందని ఆయన పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును అక్బరుద్దీన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు లేనిదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారా?” అని ఆయన ప్రశ్నించారు. అక్కడ కాంగ్రెస్కు వచ్చిన విజయంలో ఎంఐఎం పాత్ర కీలకమని, ఆ విషయాన్ని వారు మర్చిపోకూడదని పరోక్షంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి తమ అవసరం ఎప్పుడూ ఉంటుందనే సంకేతాలను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పంపారు.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందని అక్బరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో తమ పార్టీ బలం ఏంటో ప్రత్యర్థులకు చూపిస్తామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, అత్యధిక వార్డులను గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ధీటుగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కేవలం పార్టీ నేతలు, కార్యకర్తల కఠిన శ్రమ, ప్రజల మద్దతు వల్లనే సాధ్యమైందని, ఎంఐఎం మద్దతుతోనే గెలిచామని అనుకోవడం పొరపాటని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను చూసి ప్రజలు పట్టం కట్టారని, తమ గెలుపును మరొకరి ఖాతాలో వేయాలని చూడటం సమంజసం కాదని అక్బరుద్దీన్కు కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ ఉనికి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!