Site icon NTV Telugu

AIMIM: ‘‘ఎన్‌కౌంటర్లు చేసే వారిని ఎన్‌కౌంటర్ చేస్తాం’’.. ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Mim

Mim

AIMIM: ఉత్తర్ ప్రదేశ్ మీరట్ సభలో ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ చేసిన వ్యాఖ్యలు యూపీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌కౌంటర్లు, ‘బుల్డోజర్ యాక్షన్’ జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. యోగి సర్కార్‌పై, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సోమవారం మీరట్‌లో జరిగిన ‘‘ఈద్ మిలన్’’ కార్యాక్రమంలో ఈ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Crime: మత్తుమందు ఇచ్చి మహిళపై డాక్టర్ అఘాయిత్యం..

రాష్ట్రంలోని ప్రజలు తమకు 111 మందిని కాకుండా, కేవలం 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే చాలని, రాష్ట్రంలో ఏ ఒక్క ముస్లిం కూడా ఎన్‌కౌంటర్ బారిన పడకుండా తాము చూసుకుంటామని కామెంట్స్ చేశారు. ఏ ముస్లిం అయినా ఎన్‌కౌంటర్లలో చంపబడితే, ఆ ఎన్‌కౌంటర్ కు బాధ్యులైన వారే స్వయంగా ఎన్‌కౌంటర్ ఎదుర్కోవాల్సి వస్తుందని షౌకత్ అలీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.

2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఎంఐఎం నేత చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మరోవైపు, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ.. ఏ పార్టీకైతే 111 ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో వారు ఈ రోజు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. కేవలం ఆరోపణల ఆధారంగానే రాష్ట్రంలో ఇళ్లను కూల్చివేస్తున్నారని, ప్రజలపై కాల్పులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనే ప్రయత్నంలో ఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Exit mobile version