మనం ఎన్నో కలలు కంటాం.. కానీ అవన్నీ నిజం కావు. తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల ఇవాళ నెరవేరింది. స్వయాన సీఎం కెసిఆర్ చేతుల మీదుగా అది కార్యరూపం దాల్చింది. సుదీర్ఘకాలం అనంతరం ఆ కల ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్ అనిత దంపతులు 2013 లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
Read Also: Ys Sharmila: వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. ఇంట్లో అందరికీ పెన్షన్ ఇస్తా
ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరుపెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత ఎమ్మెల్సీ మధుసూదనా చారి చొరవ తీసుకున్నారు. మీ కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆ తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్ కు తోడ్కొని వచ్చారు. విషయం తెలుసుకున్న సిఎం కెసిఆర్ దంపతులు, సురేష్ అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు..‘మహతి ’ అని నామకరణం చేసారు.
తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సిఎం దంపతులు కొత్త బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆతిథ్యం ఇచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, వూహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. సీఎం కేసీఆర్ దంపతులకు, మధుసూదనాచారికి ఆ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!