TPCC Revanth Reddy: పార్టీ ఫిరాయించిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ను కూడా అసెంబ్లీ గేటు తాకనియోద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. కేసిఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఇసుకలో మేడిగడ్డ బ్యారేజి కట్టిన అవినీతి చరిత్ర కేసిఆర్ది.. కాంగ్రెస్కు పేరు వస్తుందని Slbc నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. హైదరాబాద్లో కేసీఆర్ 10 వేల ఎకరాలను ఆక్రమించాడన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, మళ్ళీ విజయోత్సవ సభకు వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండని, కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదన్నారు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండని, కానీ వెంకట్ రెడ్డిగారు తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదని గుర్తు చేశారు. చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే పార్టీని నమ్ముకున్న కార్యకర్తల గుండెలపై తన్నిండని, పార్టీ ఫిరాయించి దొరగారి గడీలో మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండంటూ ధ్వజమెత్తారు.
Also Read: Vivek: భూస్వాములకు రైతుబంధు ఎందుకు..? కౌలు రైతులకు అండగా కాంగ్రెస్..
పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనీయొద్దని ప్రజలకు పిలుపినిచ్చారు. అక్కడి సూర్యుడు ఇక్కడమొలిచినా.. ప్రాణం పోయినా.. ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనివ్వొద్దు.. ఇప్పుడు మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్ల వరకు చరిత్రలో నిలిచిపోవాలన్నారు. ఆనాడు వెంకన్న వైఎస్తో కొట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 3 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించారు.. ఉమ్మడి రాష్ట్రంలో 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వారు. ఇంకో పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేవి తెలిపారు. కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్కు పేరు వస్తుందనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పడావు పెట్టారన్నారు. నకిరేకల్ వేదికగా కేసీఆర్ను సూటిగా అడుగుతున్నా… ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు? ప్రశ్నించారు.
కేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు అంటూ విమర్శించారు. 60 ఏళ్లల్లో 16 మంది సీఎంలు చేసిన అప్పు 69 వేల కోట్లు.. కానీ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పు 6 లక్షల కోట్లుని తెలిపారు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగ తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడని విమర్శించారు. నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా… ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. జిల్లాలో 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించాలని, కేసీఆర్ను, బీఆర్ఎస్ను డిసెంబర్ 9న బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మీదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.