Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..

Telegram

Telegram

Explained: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు జూన్ 21న జరగబోయే నీట్ (NEET) రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. నకిలీ ప్రశ్నపత్రాల అమ్మకాలు, తప్పుడు ప్రచారాలకు ఈ ప్లాట్‌ఫారమ్ వేదికగా మారడమే ఇందుకు కారణం. అయితే, టెలిగ్రామ్‌లాగే వాట్సాప్ కూడా మెసేజింగ్ యాప్ అయినప్పుడు, దాన్ని వదిలేసి కేవలం టెలిగ్రామ్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. దీని వెనుక బలమైన సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాలు ఉన్నాయి.

టెలిగ్రామ్ నిందితులకు కేరాఫ్ అడ్రస్‌గా మారడానికి ప్రధాన కారణం అందులోని మితిమీరిన అనానిమిటీ (గుర్తింపును దాచడం). వాట్సాప్‌లో ప్రతి ఒక్కరికీ ఫోన్ నంబర్ కనిపిస్తుంది. కానీ టెలిగ్రామ్‌లో ఫోన్ నంబర్‌ను దాచేసి కేవలం ఒక యూజర్‌నేమ్‌తో అకౌంట్ రన్ చేయవచ్చు. దీనికి తోడు, టెలిగ్రామ్ ఛానల్స్‌లో అపరిమితమైన సబ్‌స్క్రైబర్లను చేర్చుకునే వీలుంది. అంటే, ఎవరో తెలియని ఒక వ్యక్తి గ్రూపులు సృష్టించి లక్షలాది మందికి నకిలీ పేపర్లు ఎరవేసి, కోట్ల రూపాయలు వసూలు చేసినా వారిని పట్టుకోవడం సైబర్ క్రైమ్ పోలీసులకు చాలా కష్టంగా మారుతోంది. గత ఏడాది జరిగిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం.. టెలిగ్రామ్‌లోని కేవలం 339 సైబర్ నేరాల ఛానల్స్‌ను దాదాపు 2.38 కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

×
×
Ad

మరో ముఖ్యమైన కారణం టెలిగ్రామ్‌లో ఉండే ఫైల్ షేరింగ్ పరిమితి, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్. సిగ్నల్ వంటి అత్యంత సురక్షితమైన యాప్‌లు ఉన్నప్పటికీ, మోసగాళ్లు టెలిగ్రామ్‌ను ఎంచుకోవడానికి కారణం ఇందులో ఎలాంటి కంప్రెషన్ లేకుండా ఏకంగా 2GB వరకు పెద్ద పెద్ద ఫైళ్లను సులువుగా షేర్ చేయవచ్చు. సినిమాల లీకేజీలు ఇక్కడే జరగడానికి కూడా ఇదే కారణం. అన్నింటికంటే ప్రమాదకరమైనది ఏమిటంటే, టెలిగ్రామ్‌లో పాత మెసేజ్‌లను ఎడిట్ చేసినా ఒరిజినల్ టైమ్‌స్టాంప్ (మెసేజ్ పంపిన సమయం) అలాగే ఉంటుంది. పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నపత్రాన్ని పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేసి, పాత టైమ్‌స్టాంప్‌తో ఎడిట్ చేయడం ద్వారా.. పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు నకిలీ ఆధారాలను సృష్టించడానికి చేతగాని ముఠాలు ఈ ఫీచర్‌ను వాడుకున్నాయి. అందుకే ప్రభుత్వం జూన్ 22 వరకు యాప్‌ను పూర్తిగా నిషేధించడంతో పాటు, జూన్ 30 వరకు ఈ ఎడిటింగ్ ఫీచర్‌ను సైతం దేశంలో నిలిపివేసింది. వాట్సాప్‌లో కూడా ఎడిట్ ఆప్షన్ ఉన్నప్పటికీ, దానికి నిర్దిష్ట సమయం ఉంటుంది. ఎడిట్ చేసేటప్పుడు కొత్త ఫైళ్లను యాడ్ చేసే వీలుండదు.

చివరగా, ప్రభుత్వ నిబంధనలకు సహకరించే విషయంలోనూ ఈ రెండు యాప్‌ల మధ్య చాలా తేడా ఉంది. వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సంస్థలు భారత ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి వెంటనే చర్యలు తీసుకుంటాయి. పైగా వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ తన ప్లాట్‌ఫారమ్‌లోని పబ్లిక్ గ్రూపుల ప్రవర్తనను, వాటి ప్యాటర్న్స్‌ను మానిటర్ చేయడానికి శక్తివంతమైన AI టూల్స్‌ను వాడుతుంది. కానీ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ సిద్ధాంతమే వేరు. ప్రభుత్వాలకు, టెక్ దిగ్గజాలకు లొంగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ యాప్‌ను రూపొందించారు. ఇండియాలో టెలిగ్రామ్‌కు ఎలాంటి అధికారిక కార్యాలయం లేకపోవడం వల్ల లీగల్ నోటీసులకు స్పందన తక్కువగా ఉంటుంది. అయితే, ఇటీవల టెలిగ్రామ్ కూడా నిబంధనలు కఠినతరం చేస్తూ రోజుకు 80 వేల నుంచి లక్షన్నర వరకు వివాదాస్పద ఛానళ్లను బ్లాక్ చేస్తున్నప్పటికీ, నీట్ లాంటి దేశవ్యాప్త పరీక్షల భద్రత దృష్ట్యా ప్రభుత్వం వాట్సాప్‌ను వదిలి, టెలిగ్రామ్‌పై కఠిన చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని భావించింది.