WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారుల ఖాతాలను ఉన్నపళంగా సస్పెండ్ చేస్తూ 24 గంటల సమీక్ష (Under Review) పరిధిలోకి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. భారత్తో సహా పలు దేశాల్లోని వినియోగదారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే సోమవారం రాత్రి (ఆగస్టు 3) 8 గంటల ప్రాంతంలో తమ వాట్సాప్ ఖాతాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సాప్ ఓపెన్ చేయగానే “Account in review” అని చూపిస్తూ, నిబంధనలను ఉల్లంఘించారో లేదో నిర్ధారించుకోవడానికి ఖాతా కార్యకలాపాలు, డివైజ్ సమాచారాన్ని పరిశీలిస్తున్నామని, 24 గంటల్లో ఫలితాన్ని తెలియజేస్తామని స్క్రీన్పై ప్రత్యక్షమైంది.
అధికారిక యాప్లను ఉపయోగిస్తున్నప్పటికీ, ఎలాంటి కారణం లేకుండా ఖాతాలు నిలిపివేయడంతో వృత్తిపరమైన పనులకు ఇబ్బంది కలిగిందని బాధితులు ఎక్స్ (ట్విట్టర్), థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సాంకేతిక లోపంపై వాట్సాప్ యజమాన్య సంస్థ మెటా (Meta) స్పందించింది. ఆటోమేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (స్పామ్, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థ) లోపం కారణంగానే నిజమైన వినియోగదారుల ఖాతాలు కూడా పొరపాటున ఫ్లాగ్ అయ్యాయని వివరణ ఇచ్చింది. “మేము వాట్సాప్ దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు, వినియోగదారుల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు అల్గారిథమ్ తప్పులు జరుగుతుంటాయి. అలాంటి లోపాలు జరిగినప్పుడు వీలైనంత త్వరగా సరిదిద్ది వినియోగదారులకు సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం” అని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం బాధితుల ఖాతాలను తిరిగి పునరుద్ధరించే ప్రక్రియను కంపెనీ చేపట్టింది.

