అమెరికా-ఇరాన్ యుద్దం…భారత్ కొంప ముంచుతోందా ? కరోనా పరిస్థితులు దేశంలో వచ్చే అవకాశం ఉందా ? యుద్ధం సుదీర్ఘకాలం కాలం కొనసాగుతుందని మోడీ చెప్పడం వెనుక ఆంతర్యమేంటి ? సంక్షోభ పరిస్థితులు వస్తాయని…ప్రజలంతా సిద్ధంగా ఉండాలని మోడీ హెచ్చరిస్తున్నారా ? ప్రజలు అన్ని రకాలుగా కష్టాలు ఎదుర్కోబోతున్నారా ? నిత్యావసరాలు ధరలు పెరుగుతాయా ? ఎలాంటి పరిస్థితులు వచ్చినా…ఎదుర్కోడావనికి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందేనా ? ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. దేశంలో మళ్లీ కరోనా పరిస్థితులు రిపీట్ అవుతాయా ? కొవిడ్ లాంటి సంక్షోభం వస్తుందని…ప్రధాని మోడీ హెచ్చరించడంలో ఆంతర్యమేంటి ? ఎలాంటి కష్టాలు వచ్చినా…ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారా ? లేదంటే ప్రజలను మానసికంగా సిద్ధం కమ్మని చెబుతున్నారా ? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అమెరికా, ఇరాన్ యుద్ధం 26 రోజులుగా కొనసాగుతూనే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు…టెహ్రాన్ ధీటుగా సమాధానం ఇస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ను ఊహించని విధంగా దెబ్బ తీస్తోంది. ట్రంప్ చర్చలకు రావాలని పిలుపునిస్తున్నా….ఇరాన్ మాత్రం యుద్ధంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతోంది. దీంతో యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెడుతోందా ? అంటే…తాజాగా పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో అనేక దేశాలకు పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ కొరత మొదలైంది. పలు దేశాలు చమురు, గ్యాస్ సమస్యల నుంచి బయట పడేందుకు ఇరాన్తో చర్చలు జరుపుతున్నాయి. చమురు, గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాయి.
అమెరికా, ఇరాన్ యుద్దం కొనసాగుతున్న వేళ…ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర పరిస్థితులు చూస్తుంటే దిగులు కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి విపత్తులు ఎదురైనా 140 కోట్ల మంది భారతీయుల సమైక్య కృషితో దేశం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత్ అనుసరిస్తున్న విధానాలు, వ్యూహాలను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయని మోడీ తెలిపారు. కొవిడ్ సమయంలో…ఆ తర్వాత దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందని గుర్తు చేశారు. భారత్ను, భారతీయులను ప్రతి సంవత్సరం పరీక్షకు గురి చేసిందని తెలిపారు. అయితే 140 కోట్ల మంది భారతీయుల సమష్టి కృషి దేశాన్ని ముందుకు నడిపిందన్నారు.
యుద్దంతో ఎలాంటి సంక్షోభ పరిస్థితులు వచ్చినా…ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు ప్రధాని మోడీ. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రతికూల ప్రభావాలు భారత్తో పాటు అన్ని దేశాలపైనా ఉంటుందన్నారు. కరోనా సంక్షోభం తరహాలోనే వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సిద్ధంగా, సమైక్యంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సవాళ్లనే సవాలు చేయగల సత్తా భారతీయుల సొంతమని ఎన్నోసార్లు రుజువు చేశామన్న మోడీ…అదే మన గుర్తింపు. అదే మన బలమంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై యుద్ధం ప్రభావం చూపుతోందని, భారత్ కూడా అసాధారణ సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.
దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు ఇంధన కష్టాలు లేకుండా చూస్తున్నామని మోదీ చెప్పారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఇంధనమే వెన్నెముక అని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చేందుకు పశ్చిమాసియా ప్రధాన వనరు. అక్కడ మూడు వారాలకు పైగా కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 20 శాతానికి పైగా అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రమైన హార్మూ జ్ వంటి జల రవాణా వనరుల మూసివేత, నౌకల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలు ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదని స్పష్టం చేశారు. దేశంలో సౌర శక్తి, అణు ఇంధన శక్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రస్తుత సంక్షోభాల వంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ దందాలు చేసేవారు, నిల్వదారులు లాభం పొందేందుకు ప్రయత్నిస్తోంది. అలాంటి వాటిని నియంత్రించేందుకు భద్రతా వ్యవస్థలను కట్టుదిట్టం చేశారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ వంటివాటిని భారీగా నిల్వ చేస్తే కఠిన శిక్షలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.
భారత్ 60 శాతం ఎల్పీజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. హర్ముజ్ మూసివేతతో సరఫరాలో అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలో దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచింది కేంద్రం. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరాటంకంగా సాగుతోంది. రకరకాల మార్గాల నుంచి చమురు, గ్యాస్ను కేంద్ర ప్రభుత్వం సమీకరిస్తోంది. గృహావసరాలకు సరిపడా ఎల్పీజీ సరఫరా పెంచుతోంది కేంద్రం. 41 దేశాల నుంచి పెట్రో ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది. 53 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయి. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడింది. యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు, యుద్ధం ప్రభావం పడిన దేశాలతో ప్రభుత్వం నిరంతర సంప్రదింపులు సాగిస్తోంది. శత్రుత్వం వీడి, ఉద్రిక్తతలకు తగ్గించేందుకు కృషి చేయాలని అన్ని పక్షాల వారిని భారత్ కోరుతోంది. ఇండియాపై కూడా యుద్ధం ప్రభావం ఉంది. వాణిజ్య మార్గాలపై ప్రభావం పడి రొటీన్గా వచ్చే పెట్రోల్, డీజిల్, ఎరువలపై ప్రభావం పడుతోంది. అయితే వీటి సరఫరాకు అవాంతరాలు తలెత్తకుండా ఇండియా అన్ని ప్రయాత్నాలు చేస్తోంది.
గల్ఫ్ దేశాల్లో కోటి మంది వరకు భారతీయులు ఉన్నారు. దీంతో భారత్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులందరికి సహయం కేంద్రం సహయం అందిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి 3 లక్షలమందికిపైగా భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి వెయ్యి మంది తిరిగివచ్చారు. యుద్ధాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు అత్యంత భారీగా పెరిగాయి. ఆ ప్రభావం మన దేశ రైతులపై పడుతోంది.
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినా…భారత్కు కష్టాలు తప్పవా ? యుద్ధం ప్రభావం మరింత కాలం కొనసాగుతుందా ? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…పరోక్షంగా భారత్ కొంప ముంచేశాడా ? ప్రధాని మోడీ హెచ్చరించినట్లే…కరోనా లాంటి పరిస్థితులు వస్తాయా ?
కొవిడ్ కష్టకాలాన్ని ఎదుర్కొన్నట్టే…ఈ సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాలి అంటూ మోడీ వ్యాఖ్యలు…దేశంలో చర్చనీయాంశంగా మారాయి. దేశ ప్రజల్లో అప్రమత్తతతో పాటు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇది కేవలం హెచ్చరిక మాత్రమేనా లేక రాబోయే గడ్డు కాలానికి సంకేతమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో…ప్రపంచం మొత్తం…కొవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. రూపాయితో డాలర్ మారకం విలువ…94 రూపాయలకు చేరింది. అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సరఫరా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. గ్యాస్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనం గ్యాస్ ఏజెన్సీలకు క్యూకడుతున్నారు. రోజుల తరబడి సిలిండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి రావాల్సిన డబ్బు…ఎక్కడికక్కడే ఆగిపోయింది. యుద్ధం ప్రభావం…దేశంలోని అన్ని రంగాల మీద తీవ్రంగా పడింది.
రోజురోజుకూ గ్యాస్ కష్టాలు పెరుగుతుండటంతో సామాన్యులకు తిప్పలు పడుతున్నారు. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద జనం బారులు తీరుతున్నారు. స్టాక్ ఆలస్యమవడం వల్ల సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు కారణంగా ఇంధనం, ఇతర సరకుల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో వస్తువుల కొరత ఏర్పడుతుంది. దీని ప్రభావంతో వంటగ్యాస్ సిలిండర్, వంటనూనెల ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తగిన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ ప్రభావం కొంత వరకు కనిపిస్తోంది. మరోవైపు విదేశీ పండ్ల ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తుండగా, మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతయ్యే వస్తువుల ధరలు మాత్రం అమాంతంగా పడిపోయాయి.
ఇరాన్లోని అణు కేంద్రాలు గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులతో యుద్ధం మరింత తీవ్రంగా మారింది. దీంతో ఇరాన్ కూడా గల్ఫ్లోని ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్లోని చమురు క్షేత్రాలను అమెరికా, ఇజ్రాయెల్లు లక్ష్యం చేసుకోవడంతో ప్రతీకారంగా ఖతార్లోని కీలక రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ దాడి చేసింది. దీంతో క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. భారత ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా వెన్నెముక వంటిది. మన దేశ చమురు అవసరాల్లో సింహభాగం అక్కడి నుంచే తీరుతోంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే అది నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయల నుండి నిత్యావసర వస్తువుల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కొవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఉపాధి కోల్పోయిన సామాన్యుడు.. ఇప్పుడు ద్రవ్యోల్బణం అనే మరో మహమ్మారి బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
ప్రధాని మోడీ మాటల్లోని అంతరార్థం లోతుల్లోకి వెళితే…యుద్ధంతో సంక్షోభ పరిస్థితులు వస్తాయని చెప్పకనే చెబుతున్నారు. అన్నిటికి సిద్దంగా ఉండాలని…ముందుగానే హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేయాలని పరోక్షంగా చెప్పారు. కరోనా కాలంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఎగుమతులు-దిగుమతుల నిలిచిపోవడం ఆ పరిశ్రమల నడ్డి విరిచే అవకాశం ఉంది. ఐటీ, తయారీ రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, అసంఘటిత రంగ కార్మికులు మళ్లీ వలసల బాట పడతారనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. కొవిడ్ లాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నట్లుగా ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల దేశ జీడీపీ వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
కరోనా వైరస్ కట్టడికి వివిధ దేశాలు ఆత్యయిక స్థితిని, కర్ఫ్యూలను విధించాయి. కొవిడ్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఎందరో కుబేరుల సంపద కళ్లముందే తరిగిపోయింది. ఇక సామాన్యులు, మధ్యతరగతి ప్రజల దుస్థితి గురించి వేరే చెప్పనక్కర్లేదు. కొన్ని దేశ నాయకులైతే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులూ జారీచేశారు. పలు దేశాలు లాక్డౌన్, భౌతిక దూరం పాటించడం, స్వీయ నిర్బంధం, రెడ్ జోన్లను ప్రకటించడం వంటి చర్యలను తీసుకున్నాయి. ప్రపంచం మహా మాంద్యంలోకి జారిపోయింది. వ్యాక్సిన్ వచ్చాక కొవిడ్ నుంచి ప్రజలు తేరుకున్నాయి. సాధారణ పరిస్థితులు వచ్చాయి.
ఇంధనం కొరత ప్రభావంతో ప్లాస్టిక్, కెమికల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎరువుల ఉత్పత్తి తగ్గినట్లయితే వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎగుమతులు నిలిచిపోవడం వల్ల పత్తి బేళ్ల కొనుగోలు నిలిచిపోయింది. సోయా ఉప ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతయ్యేవి. తాజాగా వాటి క్రయవిక్రయాల్లో కాస్త స్తబ్ధత నెలకొంది. గుడ్లు ఎగుమతులు నిలిచి ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి గుడ్డు ధర ఆరు రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ.3.50కి పడిపోయింది.
దేశానికి సంక్షోభాలు కొత్తేమీ కావు…కానీ అవి తెచ్చే పాఠాలు విలువైనవి. పశ్చిమాసియా యుద్ధం భారత్ను మరోసారి స్వయం సమృద్ధి దిశగా ఆలోచింపజేస్తోంది. కొవిడ్ కాలంలో చూపిన సహనం, ఐక్యత మళ్లీ అవసరమయ్యే రోజులు దగ్గరపడ్డాయి. అయితే ప్రభుత్వం కేవలం ప్రజల సహకారాన్ని కోరడమే కాకుండా పటిష్టమైన ఆర్థిక రక్షణ కవచాన్ని నిర్మించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలి. అప్పుడే మనం ఈ యుద్ధ సెగ నుంచి క్షేమంగా బయటపడే అవకాశం ఉంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను పెంచుకోవాలి. దౌత్యపరమైన సంబంధాల ద్వారా చమురు దిగుమతులకు అంతరాయం కలగకుండా చూడటం అత్యవసరం. అలాగే సామాన్యుడిపై ధరల భారం పడకుండా పన్నుల తగ్గింపు వంటి ఉపశమన చర్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. దేశానికి వచ్చే ఇంధన సప్లైలు రాబోయే రోజుల్లో మరింత ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 73రకాల వస్తువుల ధరలు పెరగగా ఆ ప్రభావం భారత్పైనా కనిపిస్తోంది. దీంతో ఇక్కడ కూడా పలు రకాల వస్తువుల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉంది.
పంతాలు పట్టింపులు ఒకరివి, కష్టాలు మాత్రం ఇంకొకరివి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 3వారాలుగా సాగుతున్న యుద్ధం వల్ల ఇలాగే ఉంది పరిస్థితి. సరఫరాలు నిలిచిపోవడం, మన దేశం నుంచి ఎగుమతుల్లో అంతరాయాల వల్ల అనేక విధాల దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తగా ఆ ప్రభావం భారత్పైనా కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభం కాగానే కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరా దాదాపు నిలిపివేసింది. దీంతో దేశంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలో కోత విధించడమో లేక మూసివేయడమో చేశాయి. అయితే పైకి గ్యాస్ హోటళ్లు, రెస్టారెంట్లకే అవసరం ఉంటుంది అనిపిస్తున్నా దీనితో నడిచే అనేక పరిశ్రమలు ప్రభావితం అవుతున్నాయి. ఫ్యాబ్రికేషన్, ఇంజినీరింగ్ గూడ్స్ రంగాలు, స్టీలు, టెక్స్టైల్స్, ప్లాస్టిక్, రసాయనాలు, పెట్రో కెమికల్స్ వంటి అనేక పరిశ్రమలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పలు పరిశ్రమలు అప్పటికే నిల్వ చేసుకున్న వాటితో నడిపిస్తూ ఉండగా, మరికొన్ని ఉత్పత్తి నిలిపివేస్తున్నాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా ఆయా పరిశ్రమలపై ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతోంది. వీటన్నింటి వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా మరి కొన్ని కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయి.
దేశ ఆక్వా రంగాన్ని కూడా పశ్చిమాసియా యుద్ధం దెబ్బతీస్తోంది. నౌకా రవాణా స్తంభించిపోవడంతో పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలు పోర్టుల్లోనే ఉండి పోయాయి. దీంతో వనామీ రొయ్యల ధర కిలోకు 20 నుంచి 50రూపాయలు తగ్గింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో గత ఆగస్టులో అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై అదనంగా 50 శాతం సుంకాలు విధించారు. యాంటీ స్టాంపు డ్యూటీ కింద మరో 9శాతానికి పైగా వసూలు చేశారు. మొత్తం 59శాతం అదనపు భారం పడడంతో అమెరికాకు ఎగుమతులు తగ్గిపోయాయి. వంద కౌంట్ కిలో రొయ్యల ధర రూ.210లకు పడిపోయింది. ఆ తర్వాత ట్రంప్ సుంకాలను 15 శాతానికి తగ్గించడంతో ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఆ ఆనందం అప్పుడే ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ ధరలు తగ్గిపోయాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ధరలు కుప్పకూలి తీవ్రంగా నష్టపోతామని రొయ్యల సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధ జ్వాలలు పరిసర దేశాల్ని ప్రత్యక్షంగా, దిగుమతులు, ఎగుమతులపై ఆధారపడిన దేశాల్ని పరోక్షంగా కాల్చేస్తున్నాయి. ఇక్కడే భారత్ ఊహించని సవాళ్లు ఎదుర్కొంటోంది. దేశీయ చమురు అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారం. యుద్ధానికి ముందు వరకు భారత్కు వచ్చే చమురు సరఫరాలో 40 నుంచి 50 శాతం హార్మోజ్ జలసంధి ద్వారానే సాగేది. ఇప్పుడా జీవ నాడి బిగుసుకుపోయి, ఇక్కడ అనేక రంగాలకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఇంధన, ఏవియేషన్ రంగం ఆ కష్టనష్టాల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ముడిచమురు మంటతో విమానయాన ఇంధన ఖర్చులు పెరిగి టికెట్ ధరలు భారీ స్థాయిలో ఎగబాకాయి. ఇదే సమయంలో మన దేశ యూరియా, ఎన్పీకే వంటి ఎరువుల అవసరాల్లో 40 శాతం గల్ఫ్ నుంచే తీర్చుకుంటోంది. ఇప్పుడు ఆ సరఫరా ఆగడం వల్ల సాగు ఖర్చులు పెరిగి ఆహార భద్రతపై ప్రభావం పడే ప్రమాదం నెలకొంది. దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న భారతీయ టెక్ కంపెనీలు, మౌలిక సంస్థల వ్యాపారాలు మందగింపు దశలో ఉన్నాయి.
ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు, షిప్పింగ్ ఛార్జీలు పెరగడం వల్ల భారత ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఒక్క ఎల్ఐసీనే 70 వేల కోట్ల మేర పెట్టుబడులను నష్టపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల భద్రత ప్రమాదంలో పడింది. చమురు ధరలు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఇప్పటికే ఇద్దరు భారతీయ నావికులు ఈ యుద్ధ గందరగోళంలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సుమారు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. వారి భద్రత ఒక సమస్య అయితే, వారు పంపే రెమిటెన్స్లు తగ్గడం భారత విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతోంది.
గల్ఫ్ దేశాలకు భారత్ ఎగుమతులు దాదాపు స్తంభించి పోయాయి. దేశం నుంచి వెళ్లే బాస్మతీ బియ్యం, పండ్లు, కూరగాయలతో పాటు పౌల్ట్రీ, ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతి నెలా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే కోట్లాది కోడిగుడ్ల రవాణా నిలిచిపోవడంతో, ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్లకు మళ్లాయి. మరికొన్ని సముద్రంలో దిక్కులు చూస్తున్నాయి. ఫలితంగా దేశీయంగా ధరలు పడిపోయి కోళ్ల పెంపకం దారులు నష్టాల్లో చిక్కుకుపోతున్నారు. మరోవైపు, గల్ఫ్ ప్రాంతానికి జరిగే వేల కోట్ల విలువైన ఔషధ ఎగుమతులు కూడా ఆగిపోయాయి. హార్మోజ్ జలసంధి మూతపడటంతో రవాణా సమయం పెరగడం వల్ల ఇన్సులిన్, వ్యాక్సిన్ల వంటి అత్యవసర మందులు పాడైపోయే ప్రమాదం ఏర్పడటమే కాకుండా, ముడి పదార్థాల ధరలు పెరిగి మందుల తయారీ వ్యయం ఇంకా ఎక్కువగా అవుతోంది. యుద్ధం వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితులు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. వృద్ధి రేటును కూడా ఇది దెబ్బతీసే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, రూపాయి విలువపైనా ప్రభావం ఉండే ప్రమాదం కనిపిస్తోంది. అంతిమంగా ట్రంప్ రాజేసిన చిచ్చు…భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆయిల్ వార్ ప్రభావం భారత్పై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భారత్ దాదాపు 80 నుంచి 85 శాతం ఎల్ఎన్జీ, ఎల్పీజీ గ్యాస్లను ఖతర్, సౌదీ అరేబియాల నుంచే కొనుగోలు చేస్తోంది. ఇరాన్ దాడుల కారణంగా ఖతర్, సౌదీ అరేబియాలలోని ఎల్ఎన్జీ, ఎల్పీజీ కర్మాగారాలు, యూనిట్ల కార్యకలాపాల్లో వేగం తగ్గే అవకాశాలు ఉన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా ఎల్ఎన్జీ, ఎల్పీజీ సప్లై మార్గాలకు ఇప్పటికే అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆయిల్ వార్ కొనసాగితే, భారత్ ఎల్ఎన్జీ, ఎల్పీజీ కొరతను ఎదుర్కోవాల్సి రావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎల్ఎన్జీని ప్రధానంగా భారత్లోని ఎరువుల ప్లాంట్లు, సిటీ గ్యాస్ నెట్వర్క్లు వినియోగిస్తున్నాయి. సిటీ గ్యాస్ నెట్వర్క్లు పైప్లైన్ల ద్వారా ఇళ్లకు ఎల్ఎన్జీని సప్లై చేస్తున్నాయి. ఇక సీఎన్జీని వాహనాలకు అందిస్తున్నాయి. ఈవారంలో ఆరంభంలో యూఏఈలోని అబుధాబిలో ఉన్న షా సహజ వాయువు క్షేత్రంపై ఇరాన్ దాడి చేసింది. దీంతో అక్కడ కార్యకలాపాలు ఆగిపోయాయి. ప్రపంచ గ్రాన్యులేటెడ్ సల్ఫర్ సప్లైలలో 8 శాతం షా సహజ వాయువు క్షేత్రం నుంచే జరుగుతుంటుంది. గ్రాన్యులేటెడ్ సల్ఫర్ను ప్రధానంగా ఫాస్ఫేట్ ఎరువుల్లో వినియోగిస్తారు.
యెమెన్ నుంచి హౌతీ ఉగ్ర మూకలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తుండటంతో, అంతర్జాతీయ వాణిజ్యం నిలిచిపోయి పలు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. సౌదీ అరేబియా, ఒమన్. ఈ రెండు దేశాలు నేరుగా యుద్ధంలో లేకపోయినా, ఇరాన్ హార్మోజ్ జలసంధి మూసివేతతో వారి చమురు ఎగుమతులు నిలిచి పోయాయి. సైప్రస్లోని బ్రిటిష్ సైనిక స్థావరంపై కూడా డ్రోన్ దాడి జరిగింది. అమెరికాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఇరాన్ అమలు చేస్తున్న ఈ వ్యూహం రోజురోజుకీ పదును తేలుతోంది. అమెరికా – ఇజ్రాయెల్ దాడుల తీవ్రత ఎంత పెరిగితే అంతగా భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది ఇరాన్. ప్రశాంతతకు, పెట్టుబడులకు నెలవుగా ఉన్న పర్షియన్ గల్ఫ్ తీరాన్నే అల్లాడిపోయేలా చేస్తోంది. ప్రపంచం మొత్తం పశ్చిమాసియా సంక్షోభం ఎప్పుడు సమసి పోతుందని ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కానీ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది ? అదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతానికి ఈ యుద్ధం త్వరగా ముగిసే సూచనలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
