Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం నాటి అధికార పంపిణీ ఒప్పందానికి ఎట్టకేలకు లైన్ క్లియరైంది. మాస్ లీడర్గా, అహింద గ్రూప్ నేతగా పేరున్న సిద్ధరామయ్య శకానికి తెరపడింది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివకుమార్ సీఎం పీఠం అధిరోహించనున్నారు. ఇంతకూ సిద్ధరామయ్యను రాజీనామాకు ఎలా ఒప్పించారు..? నాయకత్వ మార్పులో కాంగ్రెస్ రాజకీయ వ్యూహం ఏంటి..? కర్ణాటక సర్కారు భవిష్యత్ ఎలా ఉండబోతోంది..?
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. కొన్నాళ్లుగా సీఎం మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నా.. ఇప్పటికి సమయం కుదిరింది. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో.. రాజీనామా ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
- Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
- Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
- Story Board : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్? కొనుగోలుదారులకు షాక్, ఇన్వెస్టర్లలో వణుకు!
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న నాయకత్వ మార్పు అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధిష్టానం బుజ్జిగింపుతో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకున్నారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారానికి మాత్రం ఆయన బ్రేక్ వేశారు. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, కర్ణాటక ప్రజలను వదిలి వెళ్లేది లేదని హైకమాండ్కు చెప్పానంటున్నారు సిద్ధరామయ్య. మొదట మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టిన సిద్ధరామయ్య.. తానే స్వయంగా తదుపరి సీఎంగా డీకే శివకుమార్ పేరు ప్రతిపాదించారు. అదే సమయంలో డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్యకు పాదాభివందనం చేశారు. అప్పుడు సిద్ధరామయ్య డీకేకు గుడ్లక్ చెప్పారు. ఆ తర్వాత డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన కార్యదర్శికి లేఖ అందజేశారు సిద్ధరామయ్య. గవర్నర్ బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు లోక్భవన్ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ అధిష్ఠానం సూచనల మేరకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ఐక్యత దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్కు అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉందని.. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా తనకు సహకరించిన ప్రజలు, పార్టీ నాయకులు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్ధరామయ్య. తన రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ సిద్ధరామయ్య భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లోకి రావడం యాదృచ్ఛికమని, తమ కుటుంబంలో ఇంతకుముందు ఎవరూ రాజకీయాల్లో లేరని అన్నారు. 2006లో కాంగ్రెస్లో చేరిన తర్వాత పార్టీ తనకు ఎన్నో అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా రెండు సార్లు, ప్రతిపక్ష నేతగా రెండు సార్లు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
తన ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఎక్కువ భాగం అమలు చేశామని పేర్కొన్నారు. తొలి ఏడాదిలోనే ఐదు గ్యారంటీ పథకాలను ప్రారంభించామని తెలిపారు. ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసినప్పటికీ ప్రజల కోసం పని చేయడంలో వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే
సిద్దరామయ్య రాజ్యసభకు వెళ్లేందుకు నిరాకరించడం కర్ణాటక కాంగ్రెస్లో సమీకరణాలు ఇంకా పూర్తిగా డీకే శివకుమార్వైపు మారలేదనే సంకేతంగా కనిపిస్తోంది. మరో రెండేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు కొనసాగించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తన వర్గానికి ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గకుండా చూడాలన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. మరోవైపు సీఎం మార్పు జరిగినా.. సిద్దరామయ్య ప్రభావం అలాగే కొనసాగుతుందనే సందేశాన్ని పార్టీ హైకమాండ్ కూడా ఇవ్వాలనుకుంటోందని అంటున్నారు. దీంతో డీకే శివకుమార్కు సీఎం పదవి దక్కినా.. కాంగ్రెస్లో అసలు పవర్ సెంటర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కర్ణాటకలో అధికారం మార్పును ఎలాంటి అసంతృప్తులు లేకుండా నిర్వహించాలని చూస్తోంది. ఒకవైపు డీకే శివకుమార్కు సీఎం పదవి ఇచ్చే హామీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండగా.. మరోవైపు సిద్దరామయ్య ప్రభావాన్ని కూడా తగ్గించకుండా సమతౌల్యం పాటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కుదిరిన రెండున్నరేళ్ల రొటేషన్ ముఖ్యమంత్రి ఒప్పందంలో భాగంగా నాయకత్వ మార్పు జరగాలని కొంతకాలంగా డీకే శివకుమార్ పట్టుబడుతూ వచ్చారు. మొదట్లో అసలు ఒప్పందమే జరగలేదన్నట్టుగా మాట్లాడిన సిద్ధరామయ్య.. తర్వాత తనకు అత్యధిక కాలం పదవిలో ఉన్న కర్ణాటక సీఎంగా రికార్డు వచ్చేవరకు ఆగాలని హైకమాండ్ను కోరారు. దీంతో అప్పటిదాకా ఆగాలని డీకేకు సూచించిన హైకమాండ్.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి.. కొత్త ప్రభుత్వాల ఏర్పాటు కూడా జరిగాక.. కర్ణాటకపై దృష్టి సారించి.. నాయకత్వ మార్పిడి సాఫీగా జరిగేలా పావులు కదిపింది.
ప్రస్తుతానికి కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ప్రస్తుతం ఇండోర్లో ఉన్నారు. ఆయన బెంగళూరు ఎప్పుడొస్తారనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఆయన వచ్చాక సిద్ధరామయ్య రాజీనామాపై అధికారిక నిర్ణయం వెలువడనుంది. ఇంతవరకూ గవర్నర్ బెంగళూరుకు వచ్చే తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదని, విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్ కూడా బుక్ చేయలేదని అంటున్నారు.
సిద్ధరామయ్య రాజీనామాతో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటిదాకా సీఎం పీఠం విషయంలో రాజీ లేదని చెబుతూ వచ్చిన డీకే శివకుమార్.. చివరకు తన పంతం నెగ్గించుకున్నారు. మొదట్లో డీకే శివకుమార్కు సీఎం పదవి దక్కుతుందా.. లేదా అనే అనుమానాలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఓపికగా ఎదురుచూసిన డీకే.. ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా.. ఢిల్లీ వెళ్లినప్పుడు హైకమాండ్ దగ్గర మాత్రం అధికార పంపిణీ ఒప్పందం కచ్చితంగా అమల్లోకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీనికి తోడు తాను సుదీర్ఘకాలంగా పార్టీకి అందించిన సేవలు, ఆర్థిక మద్దతు గురించి కూడా చెప్పిన డీకే శివకుమార్.. పార్టీ కష్టకాలంలో తాను అండగా ఉన్న విషయం మర్చిపోవద్దని ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి గుర్తుచేస్తూ వచ్చారు. ఇక్కడ బెంగళూరులో కూడా డిప్యూటీ సీఎంగా ఉంటూనే.. నాయకత్వ మార్పిడి ఎప్పటికైనా తప్పదని పరోక్ష సంకేతాలిస్తూనే వచ్చారు.
మొత్తం మీద నాలుగ్గోడల మధ్య కుదిరిన అధికార పంపిణీ ఒప్పందం.. కాస్త ఆలస్యంగా అయినా అమల్లోకి వస్తోందని డీకే మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్లే సమయమున్న తరుణంలో.. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారుకు సవాళ్లు లేకపోలేదు. ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంతో పాటు.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూల వాతావరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కొత్త సీఎంపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు సిద్ధరామయ్య రాజీనామాకు ఒకరోజు ముందే అహింద సామాజికవర్గ కులగణన నివేదికకు అధికారికంగా ఆమోదం తెలపడం.. ఎలాంటి సమీకరణాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కులగణన నివేదికను కాంగ్రెస్ ఎలా తనకు అనుకూలంగా మార్చుకోనుందనేది తేలాల్సి ఉంది. ఇన్నాళ్లూ అహింద గ్రూప్కు తిరుగులేని నేతగా ఉన్న సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించడం పట్ల ఆ వర్గంలో అసంతృప్తి రాకుండా చూసుకోవడంతో పాటు.. మిగతా సామాజికవర్గాల్నీ కాచుకోవడం కొత్త సీఎంకు సవాలేననే చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెరవెనుక దీనికి సంబంధించిన కసరత్తు మొదలైపోయిందనే అభిప్రాయాలూ లేకపోలేదు.
తాజావార్తలు
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..