Virat Kohli: కోహ్లీ విమర్శలను పట్టించుకోడనేది అబద్దం.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • మరోసారి వార్తల్లో ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్
  • కోహ్లీ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు
  • విమర్శలను కోహ్లీ చాలా సీరియస్‌గా తీసుకుంటాడు
Sanjay Manjrekar Kohli

Sanjay Manjrekar Kohli

భారత మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి టీమిండియా క్రికెట్ దిగ్గజంగా విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. క్రికెట్ విశ్లేషకుడిగా ఎప్పుడూ తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్పే మంజ్రేకర్.. గతంలో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై చేసిన ‘బిట్స్ అండ్ పీసెస్’ కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. కోహ్లీపై కూడా ఆయన తరచూ విమర్శలు చేస్తుంటాడు. తాజాగా స్పోర్ట్‌స్టార్ ఇన్‌సైట్ ఎడ్జ్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మంజ్రేకర్.. కింగ్ కోహ్లీ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని చెప్పినా.. వాస్తవానికి అతడు విమర్శల విషయంలో చాలా సెన్సిటివ్‌గా ఉంటాడని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. ‘విరాట్‌ కోహ్లీకి తన వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యం. కానీ విమర్శల విషయంలో అతడు చాలా సున్నితంగా స్పందిస్తాడు. అతడి గురించి ఎవరు ఏమంటున్నారో అతడికి ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు అతడితో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కొన్ని సందర్భాల్లో టాస్ సమయంలో విరాట్ అకస్మాత్తుగా నాతో చాలా కోల్డ్‌గా ప్రవర్తించేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని.. బహుశా విరాట్ గురించి నేను చేసిన వ్యాఖ్యలు అతడికి తెలిసి ఉంటాయని’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

విమర్శలను విరాట్ కోహ్లీ తన ఆటకు ప్రేరణగా మార్చుకుంటాడని కూడా మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ‘బయట వాళ్లు ఏమనుకున్నా పట్టించుకోమని చెప్పిన వారిలో విరాట్ ఒకడు. కానీ అతడు విమర్శలను చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. అది ఒకరకంగా మంచిదే కావచ్చు. ఎందుకంటే అలాంటి విమర్శలు కోహ్లీని పెద్ద ఇన్నింగ్స్ ఆడేలా ప్రేరేపిస్తాయి’ అని తెలిపాడు. కెప్టెన్‌గా కోహ్లీ ప్రత్యేకత గురించి కూడా మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. ‘పిచ్ ఫ్లాట్‌గా ఉన్నా, బౌలర్లకు సహాయం లేకపోయినా.. వికెట్లు తీసే అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా కోహ్లీ ఎప్పుడూ జట్టులో ఎనర్జీ తగ్గనివ్వడు. ఫీల్డ్‌లో ఆటగాళ్లలో నమ్మకం నింపుతాడు. ఏదో ఒకటి జరుగుతుందని అందరినీ నమ్మించే గుణం అతడి గొప్ప బలం’ అని అన్నాడు.

జట్టుపై కెప్టెన్ ప్రభావం ఎలా ఉంటుందో కూడా సంజయ్ మంజ్రేకర్ వివరించాడు. ‘జట్టు ఎప్పుడూ కెప్టెన్‌ లానే ఉంటుందని నేను నమ్ముతాను. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రతి ఆటగాడు అతడి లాగే దూకుడుగా ఉన్నాడు. ఎవరైనా ఫీల్డ్‌లో నిరుత్సాహంగా కనిపిస్తే.. తదుపరి టెస్టులో ఆడే అవకాశం ఉండేది కాదు. అందుకే ప్రతి ఆటగాడు కోహ్లీ ఆగ్రహం, ఎనర్జీకి అనుగుణంగా స్పందించేవాడు’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.