IND vs ENG Test: లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది టీమిండియా. అయితే, వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అర్థ శతకం చేసిన ఆదుకున్నాడు. కరుణ్ 98 బంతుల్లో 52 రన్స్ తో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఇక, అతడితో పాటు వాషింగ్టన్ సుందర్ (19) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. కాగా, టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(2), కేఎల్ రాహుల్ (14), రవీంద్ర జడేజా(9), కెప్టెన్ గిల్ (21) తీవ్రంగా నిరాశపరచగా.. సాయి సుదర్శన్ (38) పర్వాలేదనిపించాడు. అయితే, ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ తలా రెండు వికెట్లు తీసుకొగా.. క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
Read Also: Yuzvendra Chahal: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. విడాకులపై మౌనం వీడిన చాహల్
అయితే, టీమిండియా బ్యాటింగ్ లో విఫలం కావడానికి ప్రధాన కారణం మాత్రం ఓవల్ లో కురిసిన వర్షమే అని చెప్పాలి. ఎందుకంటే.. వరుస విరామాల్లో వాన పడటంతో స్టేడియం పచ్చిగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్స్ లో టీమిండియాపై ఒత్తిడి పెంచి వికెట్లు సాధించగలిగారు. మరోవైపు, శుభ్మన్ గిల్ వరుసగా అయిదో టెస్టులోనూ టాస్ ఓడిపోవడం జట్టు వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపింది. రెండో రోజు ఆటలో బ్యాటింగ్ పటిష్టంగా కొనసాగితేనే భారత్ తిరిగి మ్యాచ్ లో నిలుస్తుంది.. లేకపోతే.. ఈ సిరీస్ ను టీమిండియా కోల్పోయే అవకాశం ఉంది.
Read Also: US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!
మరోవైపు, భారత్ ఇన్నింగ్స్లో అనూహ్య సంఘటన జరిగింది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వ్యవహారశైలి చర్చకు వచ్చింది. 13వ ఓవర్ వేసిన టంగ్ భారత బ్యాటర్ సాయి సుదర్శన్కు యార్కర్ బాల్ సంధించాడు. దానిని ఆడలేక సాయి కింద పడిపోగా.. బంతి ప్యాడ్స్కు తగలడంతో టంగ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. దీనిని ధర్మసేన తిరస్కరించడం వరకు బాగానే ఉంది.. కానీ, అవుట్ కాదని చెబుతూనే అతను బంతి ముందే బ్యాట్కు తగిలినట్లుగా తన వేళ్లతో ఇంగ్లీష్ జట్టుకు సైగ చేశాడు. అయితే, రూల్స్ ప్రకారం డీఆర్ఎస్ కోసం ఇచ్చే 15 సెకన్లు ముగిసే వరకు ఆటగాళ్లకు సహకరించే సంజ్ఞలు అంపైర్లు చేయరాదు.. కానీ ధర్మసేన ఇలా చేయడం వల్ల ఇంగ్లాండ్ జట్టుకు పరోక్షంగా సహకరించినట్లైంది. దీంతో అంపైర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.