MS Dhoni: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026 కోసం అన్ని జట్లు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 4-1తో ఘన విజయం సాధించిన భారత జట్టు తన సత్తాను మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో టీమిండియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, భారత జట్టులో విధ్వంసకర బ్యాట్స్మెన్లు, నాణ్యమైన ఆల్రౌండర్లు, అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అనుభవం పరంగా కూడా టీం బలంగా ఉందని మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసించారు. అయితే, టీ20 వరల్డ్ కప్లో భారత్కు అతిపెద్ద సవాల్ ఏంటో మహేంద్రుడు వెల్లడించారు.
Read Also: Megna Mukharjee: సౌరవ్ గంగూలీతో యాడ్లో నటించి.. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ!
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటి.. ఒక మంచి టీంలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని ఎంఎస్ ధోనీ తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమతూకంగా ఉన్నప్పటికీ..ఈ ఫార్మాట్లో ఆడిన అనుభవం కూడా చాలా ఉంది.. ఒత్తిడిలోనూ ఆడగల సామర్థ్యం ఈ జట్టుకు ఉంది.. ప్రతి ఆటగాడు తన పాత్రను చాలా కాలంగా అదే స్థాయిలో నిర్వహిస్తున్నాడని చెప్పారు. అయితే, తనను ఎక్కువగా భయపెట్టేది మంచు (Dew) అని ఆయన స్పష్టం చేశారు. నాకు డ్యూ అంటే అస్సలు ఇష్టం లేదు.. ఈ మంచు మ్యాచ్ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తుంది అన్నారు. డ్యూ ఉన్నప్పుడు టాస్ చాలా కీలకంగా మారుతుంది అని మహేంద్ర సింగ్ ధోని తెలియజేశారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 4, బుధవారం దినఫలాలు..
అయితే, సమాన పరిస్థితుల్లో ప్రపంచంలోని ఉత్తమ జట్లతో 10 మ్యాచ్లు ఆడితే భారత్ ఎక్కువ మ్యాచ్లు గెలుస్తుందని మిస్టర్ కూల్ ధోనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితులు మారితే, ముఖ్యంగా మంచు ప్రభావం ఉంటే, మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోతుందని అన్నారు. టీ20 ఫార్మాట్లో టాప్ ఆర్డర్ ప్లేయర్లు విఫలమైతే లేదా ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒకరు అసాధారణ ప్రదర్శన చేస్తే మ్యాచ్ చేతులు దాటిపోతుందని ఆయన హెచ్చరించారు. ఇది లీగ్ దశలో అయినా, నాకౌట్ దశలో అయినా జరగవచ్చని తెలిపారు. అందుకే అదృష్టం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, ఎవరికి గాయాలు కాకుండా, ప్రతి ఆటగాడు తనకు అప్పగించిన పాత్రను సరిగ్గా నిర్వర్తిస్తే టీమిండియా టైటిల్ నిలబెట్టుకోవడం సాధ్యమేనని ఎంఎస్ ధోనీ విశ్వాసం వ్యక్తం చేశారు.
