Sunil Gavaskar Fires on Team India Batters: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించింది. పసికూన ఐర్లాండ్ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. చిరకాల ప్రత్యర్థి పాక్పై మాత్రం తృటిలో ఓటమి నుంచి బయటపడింది. బౌలర్లకు సహకరించే న్యూయార్క్ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పాక్ 113/7 స్కోరుకే పరిమితమైంది. భారత్ విజయం సాధించినప్పటికీ.. బ్యాటర్ల బ్యాటింగ్ తీరు అందరినీ నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరీ ఇంత నిర్లక్ష్యంగా ఆడుతారా? అని మండిపడ్డాడు.
Also Read: T20 World Cup: టీ20 ప్రపంచకప్లో మొదటి వికెట్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి టీమ్ ఇదే!
‘పాకిస్థాన్పై భారత బ్యాటర్ల ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది. షాట్ల ఎంపికలో చాలా నిర్లక్ష్యం వహించారు. మ్యాచ్ను మనోళ్లు తేలిగ్గా తీసుకున్నట్లు అనిపించింది. ప్రతి బంతిని సులువుగా కొట్టేస్తామన్న అహంభావంతో ఆడారు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేద్దామని అనుకున్నట్లుంది. ఇది ఐర్లాండ్ బౌలింగ్ ఎటాక్ కాదు. ఏదో చిన్న టీమ్ బౌలింగ్ చేసినట్లు భారత బ్యాటర్లు భావించారు. ఇక్కడ ఐర్లాండ్ జట్టును అగౌరవపరచాలని నేను అనలేదు. పాకిస్తాన్ వంటి అనుభవం కలిగిన బౌలింగ్ యూనిట్ను ఎదుర్కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఆడాలి. ఇంకా ఓ ఓవర్ మిగిలి ఉండగానే.. భారత్ ఆలౌట్ కావడం బాధపెట్టే అంశం. చివరి ఓవర్లో మరో 5-6 పరుగులు చేస్తే.. ప్రత్యర్థిపై ఇంకా ఒత్తిడి పెరిగేది’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.