Ravi Shastri Gives Best Fielder Award To Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ప్రపంచకప్ 2024లో చూడటం చాలా బాగుందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆనందం వ్యక్తం చేశాడు. పంత్ రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయని, అతడిని ఆసుపత్రిలో చూస్తానని తాను అనుకోలేదన్నాడు. గాయాల నుంచి కోలుకుని వచ్చి.. మెగా టోర్నీ మ్యాచ్ల్లో సత్తా చాటడం అద్భుతం అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ను పంత్కు అందించిన తర్వాత రవిశాస్త్రి భావోద్వేగానికి గురయ్యాడు.
వన్డే ప్రపంచకప్ 2023 సమయంలో భారత జట్టులో జోష్ తెప్పించేలా బెస్ట్ ఫీల్డర్ మెడల్ను బీసీసీఐ పరిచయం చేసింది. మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫీల్డర్ ఎవరని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ నిర్ణయిస్తాడు. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024లోనూ ఇదే సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించింది. ఐర్లాండ్తో మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ను వారించిన ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. పాక్ మ్యాచ్లో పంత్కు వచ్చింది. బ్యాటింగ్లో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు ఫీల్డింగ్లోనూ మూడు క్యాచ్లు పట్టాడు. కీపర్గా స్టంప్స్ వెనుక చురుగ్గా కదిలాడు.
Also Read: Team India: మరీ ఇంత నిర్లక్ష్యమా.. భారత బ్యాటర్లపై గవాస్కర్ ఆగ్రహం!
మ్యాచ్ అనంతరం బెస్ట్ ఫీల్డర్ మెడల్ను రిషబ్ పంత్కు రవిశాస్త్రి అందజేశాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘మాట్లాడేముందు రిషబ్ పంత్ను హగ్ చేసుకుంటా. ప్రపంచకప్లో అతడిని చూడటం చాలా బాగుంది. బాగా ఆడుతున్నాడు. పంత్ రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయి. అతడిని ఆ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చూస్తాననుకోలేదు. వేగంగా కోలుకుని మెగా మ్యాచ్లలో సత్తా చాటడం ప్రశంసనీయం. పంత్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ గాయాల అనంతరం వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టం. శస్త్రచికిత్స తర్వాత మైదానంలోకి చురుగ్గా కదలడం అంత ఈజీ కాదు. కోట్ల మందికి నువ్ స్ఫూర్తిగా నిలిచావు. మృత్యువు అంచుల్లోకి వెళ్లి వచ్చిన పంత్ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ని ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.