Ishan Kishan In World Cup: ప్రపంచ కప్‌లో చోటు కోసం రెండేళ్లు ఎదురు చూసిన ఇషాన్ కిషన్..

  • రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌..
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ జట్టులో చోటు..
  • గిల్, జితేష్ శర్మలను జట్టు నుంచి తప్పించి ప్రపంచ కప్ టీంలో ఇషాన్ కు అవకాశం..
Ishan

Ishan

Ishan Kishan In World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టును ఇవాళ ( డిసెంబర్ 20) బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లలో ఆడిన ఆటగాళ్లకే వరల్డ్ కప్‌లో కూడా ఆడే అవకాశం దక్కుతుందన్న అంచనాల మధ్య సెలెక్టర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌ను నేరుగా ప్రపంచకప్ తుది జట్టులో చోటు కల్పిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంచనాల్లో కూడా లేని ఇషాన్ కు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది అనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.

Read Also: Live-in-relationship: విడాకులు తీసుకోకుండా “లివ్-ఇన్ రిలేషన్” చెల్లదు: హైకోర్ట్..

అయితే, ఇటీవల కాలంలో భారత టీ20 జట్టు ప్రణాళికల్లో ఇషాన్ కిషన్ పేరు పెద్దగా వినిపించలేదు. వికెట్‌కీపర్‌గా సంజూ శాంసన్, జితేష్ శర్మ, ధృవ్ జురెల్, రిషబ్ పంత్‌లతో పోలిస్తే కిషన్ చాలా వెనుకబడ్డాడనే అభిప్రాయం ఉంది. కానీ, దేశవాళీ టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు చేసిన అద్భుత ప్రదర్శనే నేరుగా వరల్డ్ కప్ టీంలో స్థానం కల్పించేలా చేసింది. జార్ఖండ్‌కు తొలి ముస్తాక్ అలీ టైటిల్‌ను అందించిన ఇషాన్, టోర్నమెంట్‌లో 517 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 33 సిక్సర్లు బాది, 197.32 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనతో పాటు టీ20ల్లో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కూడా ఇషాన్ కిషన్ ఎంపికకు మార్గం సుగమం అయింది.

Read Also: Andhra King Thaluka OTT Release: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’… స్ట్రీమింగ్ ఏ రోజున అంటే!

ఇక, ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 796 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 89 కాగా, స్ట్రైక్ రేట్ 124కి పైగా ఉంది. చివరిసారిగా 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడిన కిషన్ ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ, తాజాగా దేశవాళీలో చేసిన ప్రదర్శనతో అతడిని ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేశారు. మరోవైపు, ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆడిన జితేష్ శర్మను ఈసారి బీసీసీఐ పక్కన పెట్టింది. అలాగే, గతంలో ఫినిషర్‌గా రాణించిన రింకూ సింగ్‌కు మరోసారి తుది జట్టులో అవకాశం కల్పించింది.

Read Also: PM Modi: బీహార్ అయిపోయింది, ఇక బెంగాల్‌లో జంగిల్ రాజ్ పోవాలి..

కాగా, టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఎంపికైన 15 మందితో కూడిన భారత జట్టులో సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్), కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్) ఉన్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 20న ఫైనల్‌తో ముగుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ గ్రూప్-ఏలో USA, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్ జట్లతో తలపడనుంది.