T20 World Cup Semi-Finals: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ బెర్తుల కోసం పోటీ జరుగుతోంది. అందరి కళ్లు ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్పై నెలకొంది. టీమిండియా మరోసారి ఫైనల్స్కు వెళ్లి కప్ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గురువారం వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య సెమీస్ జరగబోతున్న తరుణంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే సెమీస్కు ముందు భారత్కు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ హెచ్చరికలు పంపారు.
ఐక్యత, నమ్మకం, ఒత్తిడిలో ప్రశాంతత ఇవే తమ సెమీఫైనల్స్కు తీసుకువచ్చాయని బ్రూక్ బుధవారం అన్నారు. టైటిల్ ఫేవరెట్ భారత్ను ఓడించడానికి తమకు అత్యుత్తమ ఆట తీరు అవసరం లేదని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తాము గెలిచిన ఏ మ్యాచ్లో కూడా ఫర్ఫెక్ట్ గేమ్ ఆడలేదని వెల్లడించారు. కానీ మా ఫర్పెక్ట్ ఆటతీరు దగ్గర్లోనే ఉందని భారత్తో జరిగే మ్యాచ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్ గురించి ఆందోళన అక్కరలేదని, అతను ఎన్నో ఏళ్లుగా అద్భుత ఆటగాడు అని, అతను జట్టులో ఎందుకు ఉన్నాడని ప్రశ్నించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇంగ్లాండ్ స్పీన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో విఫలమవుతుందనే విమర్శలు వస్తున్న వేళ.. తమ జట్టు ముంబై, కోల్కతా, పల్లెకెలే, కొలంబో వంటి వేదికలపై బాగా ఆడిందని బ్రూక్స్ గుర్తు చేశారు. భారతస్పిన్నర్లలో వరణ్ చక్రవర్తి అత్యుత్తమ బౌలర్లలో ఒకరని చెబుతూనే.. అతడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో ఎవరో ఒకరు తమ అత్యుత్తమ ఆటను బయటకు తీశారని, ఒక్క ఆటగాడు పెద్ద ఇన్నింగ్స్ ఆడినా, ఒక బౌలర్ బెస్ట్ బౌలింగ్ చేసినా మ్యాచ్ మలుపుతిరుగుతుందని అన్నారు.
