T20 World Cup 2026: ఫిబ్రవరి 15వ తేదీన జరగాల్సిన భారత్- పాకిస్థాన్ టీ20 వరల్డ్కప్ 2026 మ్యాచ్ జరుగుతుందా? అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభమైనప్పటికీ, ఈ మ్యాచ్కు సంబంధించిన ఆఫ్-ఫీల్డ్ డ్రామా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రభుత్వం భారత్తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించడంతో.. ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా ఐసీసీకి లేఖ రాసింది. ఫిబ్రవరి 15న టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తామని స్పష్టం చేస్తూ, ‘ఫోర్స్ మేజర్’ క్లాజ్ను ప్రస్తావించింది. అయితే, మిగతా మ్యాచ్ల్లో పాల్గొంటామని పేర్కొనడం గమనార్హం.
Read Also: OTT Crisis : నెట్ఫ్లిక్స్.. అమెజాన్ న్యూరూల్స్.. స్క్రిప్ట్ స్టేజ్లోనే ఆగిపోతున్న భారీ చిత్రాలు..
పాక్ కి ఐసీసీ కౌంటర్:
PCB నుంచి అధికారిక సమాచారాన్ని అందుకున్న అంతర్జాతీయ క్రికెట్ బోర్డు.. ఈ అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది. గతంలో ఇలాంటి సున్నితమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొందో అదే విధానాన్ని అనుసరిస్తూ, ఘర్షణకు బదులుగా చర్చల ద్వారా పరిష్కారం వెతుకుతోంది. టోర్నీ గౌరవాన్ని, ఆటగాళ్ల భద్రత, అభిమానుల ఆసక్తి, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతోంది. అయితే, PCB ‘ఫోర్స్ మేజర్’ క్లాజ్ను ఎందుకు కేవలం ఒక్క మ్యాచ్కే వర్తింపజేస్తుందో వివరించాలని ఐసీసీ కోరింది. భారత్ మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి, మిగతా మ్యాచ్లు ఆడటానికి కారణాలు ఏమిటి? సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించారా? ప్రభుత్వంతో మినహాయింపులపై చర్చించారా? లాంటి ప్రశ్నలను ఐసీసీ సంధించింది. ఈ నేపథ్యంలో PCB మళ్లీ ఐసీసీతో చర్చలకు సిద్ధమైంది. ప్రస్తుతం రెండు సంస్థల మధ్య నిర్మాణాత్మకంగా చర్చలు కొనసాగుతున్నాయని ఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజకీయ కోణం:
పాకిస్థాన్ ప్రభుత్వం తొలుత సోషల్ మీడియా ద్వారా బహిష్కరణ ప్రకటన చేయగా, PCB అధికారికంగా ఐసీసీకి లేఖ రాయడంలో ఆలస్యం చేసింది. ఈలోపు ఊహాగానాలు జోరుగా కొనసాగాయి. గత వారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సర్కార్ నిర్ణయాన్ని పునరుద్ఘాటించడంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది.
Read Also: Suryakumar Yadav: కోచ్-కెప్టెన్ మ్యాజిక్.. గంభీర్ గేమ్ ఛేంజర్ సలహా.. మ్యాచ్ గెలిపించిన సూర్య
ఫోర్స్ మేజర్ అంటే ఏమిటి?:
ఫోర్స్ మేజర్ అనేది యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, సర్కార్ ఆదేశాలు లాంటి అనివార్య పరిస్థితుల కారణంగా ఒప్పంద బాధ్యతలను నిర్వర్తించలేని సందర్భాల్లో ఉపయోగించే నిబంధన.. దీనిని వర్తింపజేయాలంటే, ఆ పరిస్థితి పూర్తిగా పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, సమస్యలను పరిష్కరించలేనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. తప్పుగా ఈ క్లాజ్ను ఉపయోగిస్తే, భారీ నష్టపరిహారం, శిక్షలు, ఒప్పంద ఉల్లంఘన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం గురించి పాకిస్థా్న్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం.
బహిష్కరణతో నష్టం ఎంత?:
భారత్- పాకిస్థాన్ వరల్డ్కప్ మ్యాచ్ ద్వారా సుమారు రూ. 2,200 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఒకవేళా, పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే.. ఐసీసీతో పాటు భారత్ మీడియా హక్కుల సంస్థ జియోస్టార్కు భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే ఐసీసీతో 3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పునఃసమీక్షించే ప్రయత్నాల్లో ఉన్న జియోస్టార్కు ఇది భారీ షాక్ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో 10 సెకన్ల ప్రకటనకే రూ. 40 లక్షల వరకు ధర పలుకుతుండగా.. ప్రకటనల ఆదాయంలో రూ. 200- 250 కోట్ల వరకు నష్టం సంభవించే ఛాన్స్ ఉంది. ఇక, పాకిస్థాన్ కి కూడా పెద్ద మొత్తంలో నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
భారత్ కొలంబోకు వెళ్తుందా?:
భారత్ జట్టు షెడ్యూల్ ప్రకారమే శ్రీలంకకు వెళ్తుంది. మ్యాచ్ జరిగే అవకాశాలు మెరుగ్గా ఉండటంతో, ప్రాక్టీస్, మీడియా కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగిస్తారు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియానికి భారత్ జట్టు సమయానికి చేరుకుంటుండగా, ఒకవేళ పాకిస్థాన్ జట్టు హాజరుకాకపోతే మ్యాచ్ రిఫరీ నిర్ణయం కోసం వేచి చూస్తారు. అయితే, ఇండియా- పాక్ మ్యాచ్పై ఇంకా స్పష్టత రాకపోయినా, ఐసీసీ- PCB మధ్య జరుగుతున్న చర్చలు కొంత ఆశను కలిగిస్తున్నాయి. కానీ, రాజకీయ జోక్యం, వాణిజ్య ప్రయోజనాలు, న్యాయపరమైన అంశాలు ఈ వివాదాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన ఏం జరుగుతుంది అన్నది ప్రపంచ క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
