Hardik Pandya on T20 World Cup 2024 Trophy: టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్తో టీమిండియా విజయంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్లు క్లాసెన్, మిల్లర్ సహా రబాడలను పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హార్దిక్ భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోయాడు. కన్నీటితో సహచరులను హత్తుకున్నాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మా కష్టానికి తగిన ఫలితం దక్కింది. దేశం మొత్తం కోరుకున్న విజయాన్ని సాధించాం. ఈ విజయం నాకెంతో స్పెషల్. గత ఆరు నెలలు ఎలా గడిచాయో మీకు తెలిసిందే. అనుకోని విషయాలు జరిగిపోయాయి. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్ని వదిలి ప్రపంచకప్ కోసం సిద్దమయ్యా. కష్టపడుతూ ఉంటే మరింత మెరుగవుతామని నాకు తెలుసు. అదే నేను చేశా’ అని హార్దిక్ చెప్పాడు.
Also Read: T20 World Cup Final: ఎప్పటికీ మర్చిపోలేని విజయం: రామ్ చరణ్
‘ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. జట్టు ప్రణాళికలను అమలు చేయడంలో అందరం సక్సెస్ అయ్యాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంతో విజయం సాధ్యమైంది. నాకు వారెవరో తెలియని వ్యక్తులు కూడా చాలా విషయాలు చెప్పారు. అలా అని నాకేమీ సమస్య లేదు. నేనెంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రదర్శనతో వారు సంతోషంగా ఉంటారనుకుంటా. జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. మ్యాచ్లో ఎప్పుడూ ఒత్తిడిగా భావించను. నైపుణ్యాలపైనే దృష్టిపెడుతా. చివరి ఐదు ఓవర్లలో మేం బాగా పుంజుకున్నాం. బుమ్రా మ్యాచ్ ఛేంజర్. నేను వందశాతం నిబద్ధతతో ప్రతి బంతిని విసిరా. ట్రోఫీ గెలిచినందుకు సంతోషం’ అని హార్దిక్ పేర్కొన్నాడు.