Site icon NTV Telugu

Bangladesh to Lose Rs 325 Crore: టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. రూ. 325 కోట్ల నష్టం

Ban

Ban

Bangladesh to Lose Rs 325 Crore: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ శతకవీరుడిగా గుర్తింపు పొందిన అమీనుల్ ఇస్లాం ‘బుల్బుల్’ ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం భారత్‌తో జరిగిన బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధించిన శతకం ఆయన కెరీర్‌కు చిరస్థాయిగా నిలిచింది. అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం బుల్బుల్‌కు తీవ్ర అవమానకరంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చరిత్రలోనే తొలిసారిగా, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాతీయ జట్టు ఒక ఐసీసీ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామానికి ప్రధాన కారణం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంలోని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీసుకున్న కఠిన వైఖరే. ఇక, భద్రతా కారణాలను “జాతీయ ప్రతిష్ఠ”తో ముడిపెట్టి భారత్ లో పర్యటించడానికి అవకాశం లేదని స్పష్టం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Read Also: Cheekatilo Review: చీకటిలో రివ్యూ.. పెళ్ళయ్యాక శోభిత మొదటి సినిమా ఎలా ఉందంటే?

అయితే, తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఆర్థికంగా కూడా భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే, బీసీబీకి ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 325 కోట్ల బంగ్లాదేశీ టాకాలు (దాదాపు 27 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఇతర వాణిజ్య ఆదాయాలను కలిపితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో నష్టం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ పరిణామాలతో భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై కూడా పడే ఛాన్స్ ఉంది. ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో జరగాల్సిన భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దయ్యే అవకాశాలు మెుండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ టూర్ కి సంబంధించిన టీవీ హక్కుల విలువ కనీసం 10 ద్వైపాక్షిక సిరీస్‌లకు సమానమని భావిస్తుండటంతో.. అది రద్దైతే బీసీబీకి భారీగా ఆర్థిక నష్టం తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also: Swayambhu : నిఖిల్ స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే

ఇక, బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసిఫ్ నజ్రుల్ రాజకీయ ప్రభావం తగ్గవచ్చని అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వల్ల బీసీబీ అధ్యక్షుడు బుల్బుల్ ఎదుర్కొన్న పరాభవం మాత్రం అతడికి జీవిత కాలం పాటు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని క్రీడా వర్గాలు అంటున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి చెందిన ఒక వర్గం తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశంలో ఎక్కువగా మాట్లాడింది ఆసిఫ్ నజ్రుల్ మాత్రమేనని, బుల్బుల్ చాలా అరుదుగా మాత్రమే స్పందించారని చెప్పారు. ఆటగాళ్లు దాదాపుగా మౌనంగా ఉన్నారు, సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే తమకు ఇంకా కఠిన పరిణామాలు ఎదురవుతాయనే భయం వారిలో స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. అలాగే, ఈ సమావేశం అనంతరం బుల్బుల్ తీవ్ర నిరాశలో కనిపించారని, నజ్రుల్‌ను ఒప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీసీబీలోని ఓ వర్గం ఆరోపించింది. తాజా పరిస్థితుల్లో బంగ్లాదేశ్ వరల్డ్ కప్‌కు వెళ్లలేమనే పరిస్థితి ఉన్నా, మాకు తాత్కాలిక ప్రభుత్వం నుంచి అల్టిమేటం రావడంతో.. వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయం అన్నారు.

Exit mobile version