2026 టీ20 ప్రపంచకప్లో భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐసీసీ టోర్నమెంట్లో సెలెక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే పాక్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని నెదర్లాండ్స్పై గెలుపుతో ప్రారంభించింది. మంగళవారం (ఫిబ్రవరి 10) అమెరికాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది. అయితే ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్లో మాత్రం పాకిస్థాన్ మైదానంలోకి దిగే అవకాశాలు ప్రస్తుతం లేవు.
ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్కు వచ్చేది కప్ గెలవాలనే లక్ష్యంతోనే. ప్రతి మ్యాచ్, ప్రతి పాయింట్ ఎంతో కీలకం. అలాంటి టోర్నీలో మ్యాచ్ ఆడకపోవడం ఏంటి?. పాయింట్లు వదులుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది’ అని పీటీఐతో అన్నారు. తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ తమ నిర్ణయంపై యూటర్న్ తీసుకునే అవకాశముంది. పీసీబీ అధికారులు ఆదివారం ఐసీసీ అధికారులతో సమావేశం అయ్యారు. ఐసీసీ నుంచి లేఖ అందిన మరుసటి రోజే.. ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. లాహోర్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధికారులు ఉన్నారు. మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని కోరిన బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో వారు ఈ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
బీసీబీకి పంపిన లేఖలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ విషయంలో తాము న్యాయంగా వ్యవహరించామని ఐసీసీ స్పష్టం చేసింది. అలాగే ఫోర్స్ మేజర్ క్లాజ్ను అమలు చేయాలన్న పీసీబీ నిర్ణయానికి సరైన కారణాలు చెప్పాలని కోరింది. భారత్తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్కు క్రీడాపరంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా ఐసీసీ హెచ్చరించింది. ఇక భారత్ మాత్రం ఈ కీలక మ్యాచ్ కోసం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు పీసీబీ, ఐసీసీ సమావేశాలపై ఆధారపడి ఉంది. క్రికెట్ అభిమానులంతా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
