Site icon NTV Telugu

Sanju Samson: విరాట్ కోహ్లీ లేకున్నా 196 రన్స్ ఛేజ్ చేశాం.. ప్రెస్ మీట్‌లో సంజు స్ట్రాంగ్ కౌంటర్!

Sanju Samson Press Conference

Sanju Samson Press Conference

Sanju Samson gives a bold reply about winning without Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ 2026 ముంగిట భారత వికెట్‌ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. అయితే మెగా టోర్నీలో ప్లేయర్స్ గాయాల కారణంగా అవకాశం రాగా.. నమీబియాపై 8 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. జింబాంబ్వేపై 15 బంతుల్లో 26 పరుగులు చేసి దూకుడు చూపించాడు. ఇక ఆదివారం (మార్చి 1) కోల్‌కతాలో వెస్టిండీస్‌తో చావోరేవో మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును సెమీస్‌కు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 రన్స్ చేసి టీమిండియా హీరో అయ్యాడు. అయితే మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్‌లో సంజు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. రికార్డుల కింగ్, ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ లేకున్నా.. డూ ఆర్ డై మ్యాచ్‌లో 196 రన్స్ ఛేజ్ చేశామని అన్నాడు.

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో సంజు శాంసన్‌ను ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ‘విరాట్ కోహ్లీ జట్టులో లేకుండా భారత్ టీ20 వరల్డ్ కప్‌లో 160కి పైగా స్కోర్‌ను ఎప్పుడూ చేజ్ చేయలేదు. కానీ ఈరోజు 196 పరుగులు ఛేజ్ చేశారు. మీకు ఎలా అనిపిస్తోంది?’ అని ప్రశ్నించగా.. ‘ఇది విరాట్ భాయ్ లేకుండా జరుగుతున్న తొలి టీ20 వరల్డ్ కప్. మేము దక్షిణాఫ్రికాపై మాత్రమే ఓడాం. మేము ఛేజ్ చేస్తూ 10 మ్యాచ్‌లు ఏమీ ఓడలేదు’ అని సంజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. విరాట్ లేకున్నా తాము పెద్ద స్కోర్స్ ఛేదించగలం అని సంజు చెప్పకనే చెప్పాడు. సంజు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: India Schedule 2026: టీమిండియా బిజీ షెడ్యూల్‌.. రోహిత్, కోహ్లీలకు పండగే!

టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టు ఎలా ఆడుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా భారత్ కొత్త ఆత్మవిశ్వాసాన్ని చూపింది. సంజు శాంసన్‌ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి దారి చూపించాడు. కొంతమంది విమర్శకులు విరాట్ లేకుండా జట్టు బలహీనపడిందని వ్యాఖ్యానించగా.. సంజూ తన ప్రదర్శనతో పాటు గణాంకాలతో సమాధానం ఇచ్చాడు. వెస్టిండీస్‌పై విజయం టీమిండియా బ్యాటింగ్ లోతును, యువ ఆటగాళ్ల ధైర్యాన్ని చాటిచెప్పింది. టీ20 వరల్డ్ కప్‌ 2026లో భారత్ ముందుకు దూసుకెళుతోంది. మార్చి 5న రెండో సెమీ ఫైనల్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే మైదానంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.

Exit mobile version