Sanjay Manjrekar Slams Bumrah’s Workload Management: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంపై మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బుమ్రాను టీ20 సిరీస్ల నుంచి తప్పించినప్పటికీ.. ఆ నిర్ణయం తనకు పూర్తిగా అర్థం కావడం లేదని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడినప్పుడు.. భారత్ మ్యాచ్లు ఎందుకు ఆడడు అంటూ మంజ్రేకర్ ప్రశ్నించాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ సెలెక్టర్లు చెప్పారు. అయితే ఐపీఎల్ 2026 మొత్తం సీజన్లో బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడినప్పుడు.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో కొన్ని టీ20 మ్యాచ్లు ఆడటం పెద్ద సమస్య కాదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ మంజ్రేకర్ తన సందేహాలను వ్యక్తం చేశాడు. ‘బుమ్రా కెరీర్ ప్రస్తుతం ఎలా సాగుతోందో నాకు కొంత అయోమయంగా ఉంది. అతడే భారత టీ20 జట్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను భావించాను. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో బుమ్రా వర్క్లోడ్ను సులభంగా నిర్వహించగలడనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్కు అందుబాటులో ఉండాలనే ఆసక్తి అతడిలో కనిపించడం లేదు’ అని పేర్కొన్నాడు.
గతంలో కూడా బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్పై అనేక చర్చలు జరిగాయి. అతడిని ఎంపిక చేసిన కొన్ని సిరీస్లకు మాత్రమే సిద్ధం చేయడం, మిగిలిన టోర్నీలకు విశ్రాంతి ఇవ్వడం సరైన విధానమా అనే ప్రశ్నలు తరచూ వినిపించాయి. ఈ విషయంపైనే మంజ్రేకర్ కూడా స్పందించాడు. ‘టెస్ట్ క్రికెట్ విషయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అవసరమని నేను అంగీకరిస్తాను. అలాగే వన్డే క్రికెట్ కూడా శారీరకంగా చాలా కఠినమైన ఫార్మాట్. కానీ ఐపీఎల్ మొత్తం సీజన్ ఆడిన బుమ్రా.. ఐర్లాండ్, ఇంగ్లండ్లో జరిగే కొన్ని టీ20 మ్యాచ్లు ఆడలేడని చెప్పడం నాకు అర్థం కావడం లేదు. అతడు భారత్ తరఫున మరింత కమిట్మెంట్ చూపించాలని నేను కోరుకుంటున్నాను’ అని మంజ్రేకర్ స్పష్టం చేశాడు.
బీసీసీఐ మాత్రం జస్ప్రీత్ బుమ్రా దీర్ఘకాలిక ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో గాయాల కారణంగా బుమ్రా కీలక టోర్నీలకు దూరమైన నేపథ్యంలో.. అతడిపై అదనపు భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరంగా ఉన్న బుమ్రా.. ఆసియా క్రీడల్లో మాత్రం భారత జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. దీంతో స్టార్ పేసర్ వర్క్లోడ్ మేనేజ్మెంట్పై మరోసారి క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం బుమ్రా ఫిట్నెస్ను కాపాడటం ముఖ్యమా? లేక జాతీయ జట్టుకు మరింతగా అందుబాటులో ఉండాలా? అనే అంశంపై అభిమానులు, మాజీ క్రికెటర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

