2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?

  • భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న రో-కో
  • 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
  • రవిచంద్రన్ అశ్విన్ ఏమంటున్నాడంటే?
Rohit Kohli

Rohit Kohli

Ravichandran Ashwin on Rohit and Kohli: భారత క్రికెట్ అభిమానులను ఎప్పటి నుంచో వెంటాడుతున్న ప్రశ్న ఒకటే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా?. వయసు పెరుగుతున్నప్పటికీ ఇద్దరూ తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను అద్భుతంగా కొనసాగిస్తుండటంతో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రో-కోల భవిష్యత్తు పూర్తిగా టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు. మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి మద్దతు ఉంటే తమ కెరీర్‌ను మరింత కాలం కొనసాగించగలరని యాష్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2027 ప్రపంచకప్ ప్రారంభమయ్యే సమయానికి కోహ్లీ వయసు 39 సంవత్సరాలు, రోహిత్ వయసు 40 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ వారి ఆటతీరు, ఫిట్‌నెస్‌ను చూస్తే.. ఇంకా అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో ఇది చాలా సింపుల్ విషయం. జట్టు యాజమాన్యం రోహిత్, కోహ్లీలను 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలని భావిస్తే.. వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉంటే అది ఖచ్చితంగా సాధ్యమే. అప్పుడు వారికి అవసరమైన మద్దతు అందుతుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

×
×
Ad

పరిస్థితులు మరోలా ఉంటే మాత్రం రోహిత్, కోహ్లీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కూడా అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘సరైన పునరావాస కార్యక్రమం, ఫిట్‌నెస్ ప్రణాళిక, మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి మద్దతు ఉంటే ఆటగాళ్లు తమ కెరీర్‌ను మరింత కాలం కొనసాగించగలరు. జట్టు వాతావరణం సానుకూలంగా ఉంటే వయసు పెద్ద సమస్య కాదు’ అని వివరించాడు. ఇదిలా ఉంటే అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఎంపికయ్యారు. అయితే అనూహ్యంగా విరాట్ తప్పుకున్నాడు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకమో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అనుభవం, ఫిట్‌నెస్, ఫామ్ పరంగా చూస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా భారత జట్టుకు విలువైన ఆస్తులే. అయితే 2027 ప్రపంచకప్ వరకు వారి ప్రయాణం కొనసాగుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉండనుంది. ప్రస్తుతం మాత్రం ఇద్దరూ ప్రపంచకప్ రేసులో బలంగానే ఉన్నారని ఆర్ అశ్విన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.