భారీ స్కోరు చేసినా తొలి టీ20 మ్యాచ్ ఓడిపోవడంతో.. రెండో మ్యాచ్ నెగ్గి దక్షిణాఫ్రికాపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈసారి బ్యాట్స్మన్లు చేతులెత్తేయడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో.. ఐదు మ్యాచ్లో టీ20 సిరీస్లో దఫ్రికాఫ్రికా 2-0తో ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మన్లను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చివరివరకూ ప్రయత్నించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, రిషభ్ పంత్ మాత్రం మరింత మెరుగ్గా బౌలింగ్ వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రెండో అర్థభాగంలో మెరుగ్గా బౌలింగ్ వేసి, వికెట్లు తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
‘‘మొదటి 7-8 ఓవర్లలో భువీ, ఇతర ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, ఆ తర్వాతే మేము రాణించలేకపోయాం. రెండో భాగంలో వికెట్లు తీయాల్సిన ఆవశ్యకత ఉన్న తరుణంలో తేలిపోయాం. మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో! క్లాసెన్, బవుమా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ పరంగానూ మేము మరింత రాణించి ఉండాల్సింది. మరో 10-15 పరుగులు ఎక్కువ చేసి ఉంటే.. మ్యాచ్ మనదే అయ్యుండేది. ఇప్పుడు మేము మిగిలిన మూడు మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తాం’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. తదుపరి మ్యాచ్ నుంచి తప్పులు దిద్దుకొని, తప్పకుండా గెలిచేందుకు సత్తా చాటుతామని అన్నాడు.
రెండో టీ20 మ్యాచ్ ఫలితాలు:
* టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
* భారత్ స్కోరు: 148/6 (20)
* దక్షిణాఫ్రికా స్కోరు: 149/6 (18.2)
* 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది
* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81 పరుగులు)