Why Rishabh Pant Left Out Of IND ODI Squad vs WI: వెస్టిండీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు. జట్టులో యువ ఆల్రౌండర్ నమన్ ధీర్, జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ తొలిసారి చోటు దక్కించుకున్నారు. మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు మాత్రం వన్డే జట్టులో చోటు దక్కలేదు. టీమిండియాకు పాండ్య ఎంపిక కాకపోవడానికి ఫిట్నెస్ కారణం కాగా.. టీమ్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన కీలక ఫీడ్బ్యాక్ పంత్ ఎంపికపై ప్రభావం చూపినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
వెస్టిండీస్తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. సెప్టెంబర్ 27 నుంచి తిరువనంతపురంలో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేని నేపథ్యంలో కేఎల్ రాహుల్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సెప్టెంబర్ 20న హార్దిక్ పాండ్య ఫిట్గా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ.. వన్డే జట్టులోకి తీసుకునే విషయంలో సెలెక్టర్లు కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భారత్ ఏ తరఫునైనా పది ఓవర్ల కోటా బౌలింగ్ చేయగల సామర్థ్యాన్ని పాండ్య నిరూపించుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ చేయడం సరిపోదని.. పది ఓవర్ల కోటా వేసే స్థాయిలో ఫిట్నెస్ సాధించినప్పుడే అతడిని ఎంపిక చేయాలని సెలక్షన్ ప్యానెల్ నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది.
నితీశ్ కుమార్ రెడ్డిని ఆసియా క్రీడల జట్టు నుంచి తప్పించి వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ఎంపిక చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ పాండ్య గైర్హాజరీతో పాటు వన్డే ఫార్మాట్లో సీమింగ్ ఆల్రౌండర్ల కొరత ఉండటంతో నితీశ్కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పాండ్యకు ప్రత్యామ్నాయంగా నితీశ్ను తీర్చిదిద్దే దిశగా సెలెక్టర్లు చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు రిషభ్ పంత్ను వన్డే జట్టులోకి ఎందుకు తీసుకోలేదన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. నివేదిక ప్రకారం.. టీమ్ మేనేజ్మెంట్లోని కీలక సభ్యుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైట్ బాల్ క్రికెట్లో పంత్కు అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. నిలకడగా పరుగులు చేయడం లేదనే అభిప్రాయం టీమ్ మేనేజ్మెంట్లో ఉందట. నిలకడలేమి కారణంగానే అతడికి జట్టులో చోటు ఇవ్వలేదని సమాచారం.
రిషభ్ పంత్ ప్రస్తుతం పూర్తిగా జాతీయ జట్టుకు దూరం కాలేదు. ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు అతడిని కెప్టెన్గా ఎంపిక చేసింది. ముంబైకి చెందిన పవర్ఫుల్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ తన ఫామ్ను నిరూపించుకునేందుకు ఇరానీ కప్ కీలక వేదికగా మారనుంది. వెస్టిండీస్ వన్డే సిరీస్లో కొత్త ముఖాలకు కూడా సెలెక్టర్లు అవకాశం కల్పించారు. టీ20 జట్టులో ఆసియా క్రీడల జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లే ఉండనుండగా.. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్లు యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ స్థానాల్లో చోటు దక్కించుకోనున్నారు. వెస్టిండీస్ సిరీస్కు భారత జట్టు ఎంపికలో ఫిట్నెస్, టీమ్ కాంబినేషన్తో పాటు ఆటగాళ్లపై టీమ్ మేనేజ్మెంట్ ఫీడ్బ్యాక్కు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

