ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (57) హాఫ్ సెంచరీ చేయగా.. లారా వోల్వార్ట్ (44), లిజెల్ లీ (37)లు రాణించారు. ఛేదనలో బెంగళూరు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో గ్రేస్ హారిస్ (9) ఔటైంది. స్మృతి మంధాన (7), జార్జియా వోల్ (26) క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లకు ఆర్సీబీ 43 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 90 బంతుల్లో 161 రన్స్ చేయాల్సి ఉంది.
అయితే డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వడోదరలో జరగనుండటం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. వడోదర స్టేడియంలో ఈ సీజన్లో నమోదైన గణాంకాలు చూస్తే.. ఫైనల్లో ఛేజింగ్ చేస్తున్న బెంగళూరు జట్టుకు విజయం సాధించడం పెద్ద సవాలే అనే చెప్పాలి. ఈ మైదానంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 160 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధించిన సందర్భం కేవలం ఒక్కసారే ఉంది. మొత్తం ఐదు మ్యాచ్లలో నాలుగు సార్లు ఛేజింగ్ టీమ్లు విఫలమయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో ఈ గణాంకాలే నిదర్శనం.
Also Read: Vishwambara Release Date: ఉస్తాద్, పెద్ది క్లోజ్.. ఇక అందరి కళ్లు మెగాస్టార్ ‘విశ్వంభర’పైనే!
ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ కావడంతో మెంటల్ ప్రెజర్ కూడా ఛేజింగ్ చేస్తున్న ఆర్సీబీపై ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. 160కి పైగా లక్ష్యాన్ని ఛేజ్ చేయడం ఇక్కడ అరుదైన ఘనతగా మారింది. మరి ఈ ఫైనల్లో ఆర్సీబీ చరిత్ర తిరగరాస్తుందా? లేదా గణాంకాలే విజయం సాధిస్తాయా? అన్నది కాసేపట్లో తేలిపోనుంది. ఆశలన్నీ ఇప్పుడు స్మృతి మంధాన, జార్జియా వోల్లపై ఉన్నాయి. ఇప్పటికే ముంబై రెండుసార్లు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవగా.. ఆర్సీబీ ఓసారి గెలిచింది. మూడుసార్లు రన్నరప్ అయిన ఢిల్లీ.. నాలుగో ప్రయత్నంలో అయినా టైటిల్ సాదిస్తుందేమో చూడాలి.