టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అసలంక వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 435వ వికెట్ అందుకున్నాడు. దీంతో టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున కపిల్దేవ్ 434 వికెట్లు తీసి ఇప్పటివరకు రెండో స్థానంలో ఉండగా.. తాజాగా అశ్విన్ రెండో స్థానాన్ని ఆక్రమించడంతో కపిల్దేవ్ మూడోస్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో 619 వికెట్లతో అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో హర్భజన్ 417 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఓవరాల్గా చూసుకుంటే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ 9వ స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), రెండో స్థానంలో దివంగత ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్(708 వికెట్లు), మూడో స్థానంలో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్( 640 వికెట్లు), నాలుగో స్థానంలో భారత దిగ్గజం అనిల్ కుంబ్లే( 619 వికెట్లు), ఐదో స్థానంలో ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్గ్రాత్(563 వికెట్లు), ఆరో స్థానంలో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్( 537 వికెట్లు), ఏడో స్థానంలో వెస్టిండీస్ బౌలర్ కౌట్నీ వాల్ష్(519 వికెట్లు), 8వ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్(439 వికెట్లు) ఉన్నారు.