సింగపూర్ ఓపెన్లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటుతోంది. మహిళల సింగిల్స్లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు తాజాగా సెమీ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ యూను 17-21, 21-11, 21-19 స్కోరుతో పీవీ సింధు మట్టి కరిపించింది. దీంతో టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అటు ఈ సిరీస్లో మహిళల సింగిల్స్లో ఆదిలో సత్తా చాటిన మరో తెలుగు తేజం సైనా నెహ్వాల్ క్వార్టర్స్లోనే ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన అయా ఒహోరి చేతిలో 13-21, 21-15, 20-22 స్కోరు తేడాతో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది.
Read Also: Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ
ఈ ఓటమితో క్వార్టర్స్లోనే సైనా నెహ్వాల్ ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. తొలి సెట్లో ఓడినా రెండో సెట్లో పుంజుకున్న సైనా.. తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్లో ఆమె కొనసాగించిన జోరుతో వ్యూహం మార్చి ఆడిన ఒహోరి మూడో సెట్లో సైనాకు చెక్ పెట్టింది. దీంతో సైనాకు ఓటమి తప్పలేదు. 15 నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన సైనా.. రెండో రౌండ్లో చైనా ప్లేయర్ హి బింగ్ జియావోపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో ప్రణయ్ కూడా ఇంటి బాట పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన కొడయ్ నరవోకా చేతిలో 21-12, 14-21, 18-21 స్కోరుతో ప్రణయ్ ఓటమిపాలయ్యాడు.