Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ

Pm Modi Hails India Women Cricket

Pm Modi Hails India Women Cricket

PM Modi Hails India Women Cricket Team: మహిళల ఆసియా కప్‌ 2026లో టీమిండియా అద్భుత విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. భారత మహిళల జట్టు ఆసియా కప్‌ను గెలుచుకోవడం దేశ క్రికెట్‌కు గర్వకారణమైన విషయమని పేర్కొన్నారు. టోర్నీ మొత్తం భారత జట్టు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, నిలకడ, స్ఫూర్తిని ప్రధాని అభినందించారు. ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన ప్రధాని.. భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

‘భారత క్రికెట్ గర్వపడే క్షణాలు ఇవి. మహిళా జట్టుకు అభినందనలు. ఆసియా కప్‌ 2026ను సొంతం చేసుకోవడం అద్భుతం. టోర్నీ ఆసాంతం ఆత్మవిశ్వాసం, నిలకడ, స్ఫూర్తిదాయకమైన ఆటతీరును మన అమ్మాయిలు ప్రదర్శించారు. ఈ విజయం భవిష్యత్తులో లక్షలాది మంది యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపనుంది. యువత దేశం కోసం క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తారనడంలో సందేహం లేదు’అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంకను భారత్‌ 72 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ విజయంలో ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షఫాలీ 39 బంతుల్లో 68 పరుగులు చేయగా.. స్మృతి 39 బంతుల్లో 59 పరుగులతో ఆకట్టుకుంది.

అయితే ఇన్నింగ్స్‌ చివరి దశలో శ్రీలంక బౌలర్లు పుంజుకున్నారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 14 పరుగులకే వెనుదిరగగా.. రిచా ఘోష్‌ 17 పరుగులు చేసింది. టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన జీ. కమలిని చివర్లో వేగంగా ఆడుతూ 5 బంతుల్లో 15 పరుగులు చేయడంతో భారత్‌ 183 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. శ్రీ చరణి అద్భుతంగా బౌలింగ్‌ చేసి నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ కూడా కీలక వికెట్లు తీసి లంక బ్యాటింగ్‌ పతనంలో కీలక పాత్ర పోషించింది. దీంతో శ్రీలంక 111 పరుగులకే ఆలౌటై 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్‌ మహిళల ఆసియా కప్‌ను రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. 2024 ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమికి కూడా టీమిండియా ఈ విజయంతో బదులు తీర్చుకుంది. ఆసియా కప్‌ ఫైనల్స్‌లో శ్రీలంకపై భారత్‌కు ఇది ఆరో విజయం కావడం మరో విశేషం.