పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రత్యామ్నాయంగా.. తమకంటూ ఒక ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పీసీబీ చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మద్దతు కోరుతూ పీసీబీ ఏకంగా 8 క్రికెట్ బోర్డులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో కేవలం రెండు దేశాలు మాత్రమే మద్దతు ఇవ్వడంతో పీసీబీకి భారీ షాక్ తగిలింది.
కొత్త క్రికెట్ బోర్డు కోసం చైనా, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, జింబాబ్వే వంటి దేశాలతో పీసీబీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఐసీసీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న దేశాలను ఏకం చేసి. కొత్త అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్నది పీసీబీ ప్లాన్గా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆలోచనకు ప్రపంచ క్రికెట్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. పీసీబీ సంప్రదించిన ఎనిమిది బోర్డుల్లో ఆరు బోర్డులు నో చెప్పినట్లు సమాచారం. యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యుఎస్ఏ, వెస్టిండీస్, జింబాబ్వే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు టాక్. కేవలం చైనా, బంగ్లాదేశ్ మాత్రమే పీసీబీ ఆలోచనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read: No iPhone 18: యాపిల్ లవర్స్కు షాక్.. ‘ఐఫోన్ 18’ లేనట్లేనా?
ఆరు దేశాల తిరస్కరణతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఐసీసీ స్థాయి సంస్థ ఆలోచన మొదటి దశలోనే కుప్పకూలినట్టైంది. ఈ పరిణామంపై అటు క్రికెట్ అభిమానులు, ఇటు విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐసీసీకి పోటీగా మరో అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం అంత ఈజీనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందు పాకిస్థాన్ క్రికెట్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆటపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పీసీబీ మరోసారి అనవసర నిర్ణయాలతో క్రికెట్ ప్రపంచంలో నవ్వుల పాలయ్యిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
