Pakistan Cricket Match Fixing: పాకిస్థాన్ క్రికెట్ జట్టును గతంలో పలుమార్లు వెంటాడిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో.. జట్టులోని కొందరు ఆటగాళ్లపై ఫిక్సింగ్కు సంబంధించిన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలు ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. ఈ పరాజయాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పీసీబీ.. స్వదేశానికి పంపింది. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. మొదట ఈ మార్పులకు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే కారణమని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ నిర్ణయం వెనుక వేరే కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జట్టులోని కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్కు ప్రయత్నించారనే అనుమానాలు పీసీబీకి వచ్చినట్లు పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బోర్డు కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆటగాళ్లు ఫిక్సింగ్కు పాల్పడ్డారని అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ వ్యవహారంపై పీసీబీ అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, ఓపెనర్ ఇమాముల్ హక్ వ్యవహారంపై బోర్డు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరిద్దరి ప్రవర్తనపై అనుమానాలు తలెత్తడంతో వారి మొబైల్ ఫోన్లను పీసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహ్మద్ రిజ్వాన్, ఇమాముల్ హక్ మొబైల్ ఫోన్ల నుంచి కీలక సమాచారం బయటకు వెళ్లిందా? అనే కోణంలోనూ పీసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీబీ చేపట్టిన అంతర్గత విచారణపైనే అందరి దృష్టి ఉంది. ఫోన్లు, ఇతర ఆధారాల పరిశీలనలో ఏమైనా కీలక సమాచారం బయటపడితే పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి పెను వివాదం చెలరేగే అవకాశం ఉంది. పీసీబీ విచారణ పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారంలో అసలు నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

