ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లో నేపాల్ జట్టు అద్భుత పోరాటం చేసింది. బలమైన ఇంగ్లండ్ జట్టును చివరి ఓవర్ వరకు ఉత్కంఠకు గురి చేసిన నేపాల్.. కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓటమి అనంతరం నేపాల్ క్రికెటర్ నందన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్లో మాట్లాడిన నందన్.. ఈ ఓటమి నుంచి తమ జట్టు ఎన్నో పాఠాలు నేర్చుకుందని చెప్పాడు.
ముఖ్యంగా చివరి ఓవర్ విషయాన్ని నందన్ యాదవ్ ప్రస్తావిస్తూ… ‘మాకు నేర్చుకున్న పాఠం ఏంటంటే.. ఇన్నింగ్స్ చివర్లో సిక్సర్లు బాదాలి. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా మ్యాచ్ ఫినిష్ చేయాలి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్ చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఇంగ్లండ్కు అద్భుత విజయాన్ని అందించాడు.
ఈ అద్భుత పోరాటం అనంతరం నేపాల్ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. అందరిలోకెల్లా దక్షిణాఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నేపాల్.. మీకు ఎప్పుడు అవసరమైతే నా సేవలు అందిస్తాను. పైకి, పైకి, ఇంకా పైకి వెళ్లండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్టెయిన్ ప్రశంసలు నేపాల్ జట్టుకు గొప్ప గౌరవమని నందన్ యాదవ్ పేర్కొన్నాడు. ‘క్రికెట్ను పదేళ్ల పాటు ఏలిన ఓ లెజెండ్ ఇలా స్పందించడం మాకు ఎంతో గర్వంగా ఉంది. కానీ ఇది మేనేజ్మెంట్కు సంబంధించిన విషయం’ అంటూ చెప్పాడు.
Also Read: Vignan Mahotsav 2026: మనసు చెప్పిందే వినండి.. ఇంకెవ్వరి మాట అస్సలు వినొద్దు: దీక్షిత్ శెట్టి
మ్యాచ్ తర్వాత తమ భావోద్వేగాలపై నందన్ యాదవ్ స్పందిస్తో.. ‘మాకు చాలా గర్వం కూడా ఉంది. అలానే బాధ కూడా ఉంది. ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుతో పోటీ పడి విజయంకు అతి దగ్గరలో ఓడిపోవడం బాధగా ఉంది. కానీ ఇలాంటి ప్రదర్శన చేయగలిగినందుకు గర్వంగా కూడా ఉంది. కాబట్టి ఇది మాకుమంచి అనుభూతి’ అని అన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 184 పరుగులు చేసింది. జాకబ్ బేతెల్ (55), కెప్టెన్ హ్యారీ బ్రుక్ (53) హాఫ్ సెంచరీలు చేశారు. చివర్లో విల్ జాక్స్ 18 బంతుల్లో 39 పరుగులతో దూకుడు చూపించాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ, నందన్ యాదవ్ ఇద్దరూ రెండేసి వికెట్లు తీశారు. చేధనలో నేపాల్ 80/6కే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39), దీపేంద్ర సింగ్ ఐరీ (44) పరుగులు చేశారు. భవిష్యత్తులో నేపాల్ క్రికెట్ నుంచి మరింత సంచలనాలు రావడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు.