ఈ సీజన్లో ప్లే ఆఫ్స్పై సన్రైజర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 3 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ ఘనవిజయం సాధిస్తే సన్రైజర్స్ ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఖరి మ్యాచ్కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారికంగా ప్రకటించింది.
విలియమ్సన్ స్వదేశం న్యూజిలాండ్కు తిరిగి వెళ్లిపోతున్నాడు. తన కుటుంబంలోకి కొత్తగా రాబోతున్న బేబీకి స్వాగతం పలికేందుకు అతడు వెళ్తున్నాడు. అంతా మంచే జరగాలని తమ క్యాంప్ కోరుకుంటోంది అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రకటన విడుదల చేసింది. 2015లో సారాహ్ రహీమ్ను కేన్ విలియమ్సన్ వివాహం చేసుకోగా వీరికి 2020, డిసెంబరులో ఒక పాప కూడా జన్మించింది. త్వరలోనే రెండో బిడ్డకి రహీమ్ జన్మనివ్వబోతోంది. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండేందుకు విలియమ్సన్ స్వదేశానికి వెళ్తున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్తో జరిగే ఆఖరి కీలక మ్యాచ్లో విలియమ్సన్ స్థానంలో ఎవరు ఆడతారో వేచి చూడాలి. ఈ మ్యాచ్లో కెప్టెన్గా భువనేశ్వర్ లేదా నికోలస్ పూరన్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.